CPI.. నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా … రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు.
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)కు సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (State Secretary K Ramakrishna) బహిరంగ లేఖ (Open Letter) రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం, కేంద్ర పథకాల నిధుల్లోనూ గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందన్నారు. వాస్తవాలు మభ్యపెట్టి ఏపీకి రూ.3 లక్షల కోట్లు అందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గమని రామకృష్ణ విమర్శించారు.
కాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17 వేల కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోందని.. అలాంటప్పుడు కేవలం రూ.11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని రామకృష్ణ అన్నారు. ఆ ప్లాంట్ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కుకు ముడి ఇనుము గనులు కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని అన్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు రూ.70 వేల కోట్లతో మిట్టల్ ఏర్పాటు చేయనున్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు కేటాయిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.