Varied weather conditions are likely to persist in the state for another three days.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు.
విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం (05-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మరోవైపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 43.9°C, ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 43.1°C, నంద్యాల(జి) దొర్నిపాడులో 42.9°C, మార్కాపురం(జి) పెద్దదోర్నాల, నెల్లూరు జిల్లా గూడూరు, శ్రీకాకుళం (జి) తామాడలో 42.7°C, వైఎస్సార్ కడప(జి) జమ్మలమడుగులో 42.6°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెంలో 42.2°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 42°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.9°C, పల్నాడు(జి) అమరావతిలో 41.8°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 41.6°C, గుంటూరులో 41.3°C, ప్రకాశం(జి) మర్రిపూడిలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.













































