మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలకు శ్రీకారం
ఎయిమ్స్ కు ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి
సిఎస్ఆర్ కింద ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన మెగా ఇంజనీరింగ్
ఉచిత బస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (MEIL)ను మంత్రి లోకేష్ అభ్యర్థించారు.
లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ రూ.2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది. . ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒక ఛార్జీతో 150 కి.మీ. వరకు నడపగలదు.
ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతాప్రమాణాలు కలిగి ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.కోటిరెడ్డి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమరా సుబ్బరావు, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు, కొల్లి శేషు, షేక్ రియాజ్, తాళ్ల అశోక్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.