స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం
స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవలసి ఉంది. విజయవాడలో మంత్రులు, వివిధ శాఖల సెక్రటరీలతో మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశంలో ఇదే అంశంపై దిశా నిర్దేశం చేశారు.
సమీకృత అభివృద్ధికి ప్రణాళికలు
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని
అధికారులకు సీఎం దిశానిర్దేశం
విశాఖపట్నం, ఫిబ్రవరి 12
స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవలసి ఉంది. విజయవాడలో మంత్రులు, వివిధ శాఖల సెక్రటరీలతో మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశంలో ఇదే అంశంపై దిశా నిర్దేశం చేశారు.
2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించడానికి 15 శాతం వృద్ధి రేటు దాటాల్సి ఉంది. జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రకృతి వనరుల ఆధారంగా ఐదేళ్లకు ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంది. వాటిని వీలైనంత త్వరగా అమలులోకి తీసుకువచ్చి సమీకృత అభివృద్ధికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాకు ఒక విజన్ ప్లాన్, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ విషయంలో జిల్లా అధికారులకు సెక్రటరీలు మార్గదర్శనం చేస్తారు. ప్రణాళికలు ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవడానికి విజన్ మానటరింగ్ యూనిట్లు కూడా ఏర్పాటవుతాయి.
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు భారీగా ఉంటున్నాయని, వాటి పరిష్కారం మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో అధికారులు వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. విశాఖ జిల్లాలో ముఖ్యంగా రెవెన్యూ, భూ తగదాలు, ఇళ్ల సమస్యలు, నేరాలపై పోలీసులకు అందే ఫిర్యాదులే అధికంగా ఉంటున్నాయని లెక్కలు చెబుతున్నాయి. విశాఖ జిల్లా నుంచి 37,134 ఫిర్యాదులు అందగా, వాటిలో భూ తగాదాలకు చెందినవే ఎక్కువగా ఉండడం గమనార్హం. హౌస్ హోల్డ్ అర్జీల సంఖ్య 19,422గా ఉంది. ప్రత్యేకంగా సీఎంఓకు అందిన విశాఖ జిల్లా సమస్యలు 655. ప్రజలు సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కారం కావాలని సూచించిన నేపథ్యంలో అధికారులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.