గుంటూరు పి.జి.ఆర్.ఎస్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
గుంటూరు, జూన్ 8 :
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ హాజరయ్యారు.
ముఖ్యంగా పిజిఆర్ఎస్ లో ప్రజా సమస్యలు ఎక్కువ భాగం రెవిన్యూ విభాగానికి సంబంధించినవే ఉంటున్నందున ప్రత్యేక రెవిన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ కు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా రెవెన్యూ క్లినిక్ లో ప్రవేశించారు. దాదాపు మూడు గంటలు రెవెన్యూ క్లినిక్ లో కూర్చుని వివిధ కౌంటర్ లలో వస్తున్న ఆర్జీలను పరిశీలించారు. ఆర్జీలను అధికారులు స్వీకరిస్తున్న తీరు, ప్రజలతో వ్యవహరిస్తున్న విధానం, స్పందిస్తున్న పరిస్థితిని గమనించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తరచుగా వచ్చే రెవిన్యూ సమస్యలను కులంకషంగా చర్చించారు. అర్జీదారుల నుండి వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది మధ్య సాధారణ అధికారిలా కూర్చుని ప్రజలకు వివరిస్తున్న తీరు, అందులో ఎదుర్కొంటున్న సమస్యలను గమనించారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కూడా ప్రధాన కార్యదర్శితో పాటు పాల్గొని అర్జీలు స్వీకరించారు.
దివ్యాంగులు ఎక్కడ ఉంటే అక్కడకే
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు విన్నవించుటకు కొంత మంది దివ్యాంగులు వచ్చారు. వీల్ చైర్ లలో కొంత మంది రాగా, కొంత మంది ఆటోలో వచ్చారు. వీరి పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ “మీరు ఎక్కడ ఉంటే… మేము అక్కడకే వస్తాం” అంటూ వారి వద్దకు వెళ్ళి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డి ఆర్ ఓ షేక్ ఖాజావలి , ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































