ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి
మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు
ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు
ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం
మొంథా తుపాను ముందస్తు చర్యలపై మంత్రి నారా లోకేష్
అమరావతి: మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…. తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఒకపక్క డిజాస్టర్ మేనేజర్ మెంట్ మంత్రి అనిత గారు, మరోవైపు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను సమన్వయంతో గత 24గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. గత ఐదు రోజులుగా మొంథా తుపాను గమనాన్ని పరిశీలిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాం. ఈ రోజు రాత్రి 11.30 గం.లకు అమలాపురం సమీపంలో తుపాను తీరం దాటబోతోంది. ఈ సందర్భంగా 90 నుంచి 100 కి.మీల వేగంతో అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ నెల 23వ తేదీ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. యుఏఈకి వెళ్లే ముందు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత 12 రివ్యూ మీటింగ్ లు, టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా తుపాను పరిస్థితులపై సమీక్ష చేశారు. ప్రధాని నరేంద్రమోడీ గారు సీఎంతో మాట్లాడి ముందస్తు ఏర్పాట్లపై వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రియల్ టైమ్ రిపోర్టులు పంపించింది. రాష్ట్రానికి ఏం కావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెప్పారు. తుపాను ప్రభావం, ముంపు తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం. 1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేసి పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించాం. శానిటేషన్ కు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, లైమ్, ఇతర సామగ్రిని ఆయా గ్రామాలకు చేరవేశాం.
ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం, 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈ నెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేదాజ్ఞలు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్ డీఆర్ఎఫ్, 12 ఎస్ డీఆర్ ఎఫ్ టీమ్ లు, రిజర్వ్ టీమ్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి 325 శిబిరాలు సిద్ధం చేశాం, 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి.
సహాయ చర్యలపై ముందస్తు ఏర్పాట్లు
తుపాను తీరం దాటిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు చాలా కీలకం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి 11,347 స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు రెడీ చేశాం. సైక్లోన్ డైరెక్షన్ ను బట్టి సేవలందించేందుకు 772 రిస్టోరేషన్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచాం. హాస్పటల్స్ కు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కడైన రోడ్లు కోతకు గురైతే వెంటనే పునరుద్ధరించి, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 7,289 జేసీబీ, క్రేన్స్, వాహనాలు సిద్ధంగా ఉంచాం. తాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్లను రెడీ చేశాం. తుపాను సమయంలో ప్రధానంగా ప్రభావితమయ్యేది సీపీ డబ్ల్యూ స్కీమ్స్. తిత్లీ అనుభవాలతో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కాగా చర్యలు చేపట్టి 1,037 డీజిల్ జనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించాం. ఎయిర్ టెల్, జియో, ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెల్ ఫోన్ టవర్లకు అవసరమైన డీజి సెట్లు సిద్ధం చేశారు, డీజిల్ కూడా అందుబాటులో ఉంచాం.
రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కలెక్టర్లందరికీ నిధులు విడుదల చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో రాత్రంతా బసచేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తాం. ముఖ్యమంత్రిగారు ప్రతి 2గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుపాను తీరందాటాక వెనువెంటనే డ్రోన్స్, లోలెవల్ ఫ్లయింగ్ వెహికల్స్ తో పంట నష్టం, ఇళ్లు, ఆస్తి నష్టంపై రియల్ టైమ్ ట్రాకింగ్ పెట్టి యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. దయచేసి ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. బీచ్ లు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దు. అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించండి. 100 కి.మీ.ల వేగంతో తుపాను వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతాం. ఈ సమయంలో బీచ్ ల దగ్గరకు వెళ్లడం మంచిది కాదు. ఈ రాత్రి 11.30 గంటల నుంచి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నిచోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. తీరం దాటాక కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే
ఈ రోజు ఉదయం హోంమంత్రి, నేను ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడాం, వారివద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే ఎర్రకాలువ సమస్య ఉందన్నారు. వెంటనే తగు చర్యలు చేపట్టాం. తుపాను తీరం దాటాక క్షేత్రస్థాయిలో గ్రామాలు, పంటపొలాలకు వెళ్లి సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించాం. ఇప్పుడు మా దృష్టి అంతా ప్రజలను చైతన్యవంతం చేసి, అప్రమత్తం చేయడమే. ప్రభుత్వం ఈ నెల 23నుంచే అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రిగారు ఇప్పటికి 12సార్లు సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులంతా ఫీల్డ్ లోనే ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో సహా మంత్రులంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులతోపాటు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. దీనిని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా పనిచేస్తున్నాం.
ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ ఫాం
తుపాను తీరం దాటిన తర్వాత యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరిస్తాం. తుపాన్లను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి గారికి ఎంతో అనుభవం ఉంది. ఆయన 1996 కోనసీమ తుపాను, హుద్ హుద్, తిత్లీ సమయంలో సమర్థవంతమైన సేవలు అందించారు. గత 5 రోజుల నుంచి మేమంతా ప్రిపరేషన్ లో ఉన్నాం. చెట్లు కూలిపోయినపుడు వాటిని తొలగించే వరకు ఫాలో అప్ మెకానిజం ఏర్పాటుచేశాం. హోం మంత్రి మానిటర్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో క్లియర్ చేయాలని సీఎం గారు ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో నేను మాట్లాడాను. అందరూ సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నారు. ప్రమాదం సంభవించకుండా చాలాప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు తొలగించాం. తుపానుకు సంబంధించి పూర్తిస్థాయి డేటా మాకు ఎప్పటికపుడు వస్తోంది. ఆర్టీజీఎస్ లో అవేర్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేశాం. రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్, రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. వాట్సాప్, ఎస్ఎంఎస్, వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.
అన్నిశాఖలూ సర్వసన్నద్ధం
సహాయ చర్యల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 99 శాతం కచ్చితత్వంతో మాకు సమాచారం అందుతోంది. రియల్ టైం సమాచారాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రధానిమంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పీఎంఓ వారు కూడా మానిటర్ చేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులంతా తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ రకాల సోర్స్ ద్వారా డేటా సేకరిస్తున్నాం. శాటిలైట్ మ్యాప్స్ కూడా తీసుకుంటున్నాం. ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం తేవడమే మా లక్ష్యం. ఇది రాజకీయాలకు సమయం కాదు. ప్రజలకు సేవలందించేందుకు అన్నిశాఖలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.






















































