Amravati Development Works: అమరావతి పున:ప్రారంభం.. ప్రధానికి ఆహ్వానం
అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని కార్యక్రమం కోసం స్థలం ఎంపికపై సీఆర్డీఏ అధికారులతో సీఎం భేటీ అయి చర్చిస్తున్నారు.

అమరావతి, మార్చి 18: అసెంబ్లీలోని ఛాంబర్లో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. రాజధాని పనుల పున:ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. అలాగే ప్రధాని అనుకూల సమయం, అందుబాటులో ఉన్న ముహూర్త సమయాలు తదితర అంశాలపై సీఎం సమావేశమయ్యారు. ప్రధాని కార్యక్రమం కోసం స్థలం ఎంపిక ఇతర అంశాలపైనా సీఎం చర్చిస్తున్నారు. నవనగరాల్లో ఇంకా పనులు ప్రారంభించాల్సినవి ఏంటి, వాటిల్లో ప్రధానితో ఏవి శంకుస్థాపన చేయించాలి అనే అంశాలపై సీఎం నివేదిక తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపటి ఢిల్లీ పర్యటనలో మోదీని కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
ఢిల్లీ షెడ్యూల్ ఇదే…
మరోవైపు ముఖ్యమంత్రి ఢిల్లీ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. ఈరోజు రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. రేపు (మార్చి 19) మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి సమావేశంకానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. 19న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి తిరిగి వస్తారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. 20వ తేదీ రాత్రికి అమరావతి నుంచి తిరుమలకు వెళ్లనున్న సీఎం.. 21న తిరుమలలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుని అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.