Governor’s_Address_2025-26_Budget_23_Feb_Final
- మాన్యశ్రీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు, మాన్యశ్రీ సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు: అందరికీ నా శుభాభినందనలు
- 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ శాసనసభ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారల నాయకత్వం పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ మరియు ఎన్డిఎ ప్రభుత్వ సంకీర్ణం యొక్క సంపూర్ణ మద్దతును ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాసనసభ ఎన్నికలలో నా ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి లభించిన అఖండ, చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు, గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా బలమైన ప్రకటన కూడా.
- గత ప్రభుత్వంలో అన్నిరంగాల్లో జరిగిన దుర్వినియోగం వల్ల మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి గురించి నేను ఈ సభలో గతంలో చేసిన ప్రసంగాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ఐదేళ్లలో (2019-24) జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశాను. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెట్టాయి. రాష్ట్ర వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ, ఎక్సైజ్, ఇసుక తవ్వకాల్లో లోపభూయిష్ట విధానాలతో రాష్ట్ర ఆదాయానికి గండిపడటం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోవడం, అధిక రుణ స్థాయి మరియు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడం, భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకం నిధుల మళ్లింపు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, రూ.1.35 లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయి.
- అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి దార్శనిక నాయకత్వంలో నా ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేసేందుకు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాము. మొదటి కొద్ది రోజుల్లోనే, మేము మా వాగ్ధానాలను నెరవేర్చడానికి మరియు ప్రజల జీవితాలలో స్పష్టమైన మెరుగుదలలను తీసుకురావడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాము. అవేవంటే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000/-లకు పెంచడం, విద్యా రంగాన్ని బలోపేతం చేయడం కోసం 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సిని ప్రకటించడం, ఉపాధి అవకాశాలను అంచనా వేయడానికి మరియు పెంచడానికి నైపుణ్య గణనను నిర్వహించడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గుంతలు లేని రోడ్ల కోసం మిషన్, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు.
- గత దుర్భలపాలన, దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత ఎనిమిది నెలల్లో మా ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చాం. ఇది ప్రస్తుత మరియు భవిష్యత్తు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నుండి మరిన్ని విడుదలలకు ప్రేరేపించింది. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి నిర్మిస్తామని ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఎన్.డి.ఏ. హామీ ఇచ్చినట్లుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా బలమైన పునాది వేశాం.
- మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, బిపిసిఎల్, టిసిఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. 2024-25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం రూ.14.22 లక్షల కోట్ల నుండి రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. ఇది 12.94% నామమాత్రపు వృద్ధి రేటు. మన తలసరి ఆదాయం కూడా గత సంవత్సరంలోని రూ.2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6.71%, సేవల రంగం 11.70% చొప్పున వృద్ధి చెందాయి. ఈ ప్రగతి అన్ని కీలక రంగాలలో గణనీయమైన పనితీరు వల్ల సాధ్యమయింది.
గొప్ప సంఘ సంస్కర్త స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్లు,
“అవకాశాలు ఇస్తే ప్రతీ మనిషిలో మేటి నైపుణ్యం వెలుగొందుతుంది.”
అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరిలోని ప్రతిభ ప్రకాశిస్తుంది.
నా ప్రభుత్వం ఇప్పుడు స్వర్ణాంధ్ర @ 2047 దిశగా పయనాన్ని చేపడుతున్నది.
- ఏ సమాజమైనా సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా సాగాలి. అవి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా, మరొకటి కుదుటపడదు. ఆర్థిక పురోగతి, సామాజిక సంక్షేమం పెనవేసుకుపోయేలా ఈ సమతుల్యతను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. ఈ విధానం కేవలం రోడ్లు లేదా పరిశ్రమల నిర్మాణానికి సంబంధించినది కాదు, జీవితాలను నిర్మించుకోవడం గురించి. రైతుల నుంచి విద్యార్థుల వరకు, మహిళల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించడం. అసమానతలను తగ్గించే, అవకాశాలను అందించే, వృద్ధికి ఊతమిచ్చే సమతుల్య విధానానికి ఈ ద్వంద్వ దృష్టి అవసరం. సంక్షేమం మరియు అభివృద్ధి కలిసికట్టుగా సమ్మిళిత ప్రగతి, సుస్థిర మరియు పరివర్తన చెందే ఒక ధర్మ చక్రాన్ని సృష్టిస్తాయి.
- భారతదేశంలో స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జి) ద్వారా మహిళా సాధికారత సాధించడంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మార్గదర్శిగా ఉన్నారు. 1995లోనే స్వయం సహాయక బృందాలను రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కీలక భాగంగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. స్వయం సహాయక బృందాలు లక్షలాది మంది మహిళలు, వారి కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ వృద్ధి అమోఘం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సుమారు రూ.35,000 కోట్ల బ్యాంకు లింకేజీ పంపిణీతో 30% జాతీయ వాటాతో మరియు స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 99.66% రికవరీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
- అదే సమయంలో, గౌరవ ముఖ్యమంత్రిగారు ఐటీ విప్లవానికి నాయకత్వం వహించి, హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్గా ఎదగడానికి పునాది వేశారు. ఐటిపై రాష్ట్రం ముందుగానే దృష్టి పెట్టడం వల్ల ప్రవాస తెలుగువారు ఈ పరివర్తనను ప్రత్యక్షంగా చూశారు, ప్రవాస తెలుగువారి (ఎన్ఆర్టిలు) తలసరి ఆదాయం అమెరికాలో అత్యధికంగా ఉంది. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. ఐటి నుండి కృత్రిమ మేధ వరకు పరిపాలన, పరిశ్రమలు మరియు ఆర్థిక వృద్ధి యొక్క భవిష్యత్తును రూపొందించడానికి కృత్రిమ మేధస్సు యొక్క శక్తిని ఉపయోగిస్తున్నది.
- నా ప్రభుత్వం పది సూత్రాలు – స్వర్ణాంధ్ర @2047 సుభిక్ష భవిష్యత్తు కోసం మన దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను రూపొందించింది.
- పూర్తిగా పేదరికం నిర్మూలన.
- మానవ వనరుల అభివృద్ధి & జనాభా నియంత్రణ.
- నైపుణ్యం పెంపుదల మరియు ఉపాధికల్పన
- నీటి భద్రత
- రైతు-అగ్రిటెక్
- గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్
- వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం
- ఉత్పత్తి పరిపూర్ణత
- స్వచ్ఛాంధ్ర
- విస్తృత సాంకేతికత ఏకీకరణ
స్వర్ణాంధ్ర @2047
- వికసిత్ భారత్ దార్శనికతతో నా ప్రభుత్వం ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో స్వర్ణాంధ్ర @2047 సాధించడానికి సమగ్ర రోడ్ మ్యాప్ను అమలు చేస్తోంది. 15% + వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా 2047 నాటికి, 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా ‘సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన’ సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన సమాజంగా మారడానికి మరియు రూ.58 లక్షల తలసరి ఆదాయంతో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాష్ట్రం తన ప్రత్యేకమైన అంతర్గత బలాలను సద్వినియోగం చేసుకుంటున్నది.
పేదరిక రహిత సమాజం
- వ్యక్తులు, కుటుంబాలకు సాధికారత కల్పించడం ద్వారా రాబోయే కొన్నేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర @ 2047 ప్రయాణంలో ఒక ఆవశ్యకత. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టిఆర్ భరోసాకు శ్రీకారం చుట్టాం. మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ డిబిటి సంక్షేమ పథకం లేదు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు, దివ్యాంగులకు రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచడమయింది. ఈ పథకం ద్వారా 8 లక్షల మంది దివ్యాంగులతో సహా సుమారు 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.33,312 కోట్ల వ్యయాన్ని చేస్తూ ఇప్పటివరకు రూ.29,281 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడమయింది.
- నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు, మేము ప్రజాపంపిణీ వ్యవస్థను (పిడిఎస్) బలోపేతం చేసి, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా రూ.5/-ల నామమాత్రపు ధరకే పౌష్టికాహారం అందించే 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది.
- బలహీన వర్గాల విద్య, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించి, మేము ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లను అమలు చేస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆదాయకల్పన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి రూ.2000 కోట్లను కేటాయిస్తూ ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకాలను పునరుద్ధరించడం జరిగింది, మేము ఎస్సి, ఎస్టి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కూడా అందిస్తున్నాం. ఎస్సిల వర్గీకరణ కోసం, వర్గీకరణ విధివిధానాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏకసభ్య సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
- ముఖ్యంగా 4.93 లక్షల మంది బలహీన గిరిజన సమూహాలతో కలుపుకొని 27.39 లక్షల షెడ్యూల్డ్ తెగల సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటిడిఏ ప్రాంతాలలో గిరిజనుల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధులు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాల్లో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీనిని సాధించడమవుతున్నది.
- వెనుకబడిన తరగతుల వారు (బిసిలు) సమాజానికి వెన్నుముకగా ఉన్నారు. వారి ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిసి సామాజిక వర్గాల సంక్షేమం కోసం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, ఆదాయం వచ్చే కార్యకలాపాల కోసం వివిధ కార్పొరేషన్లకు రూ.896 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడంతో సహా పలు కీలక కార్యక్రమాలను మేము అమలు చేయడం జరిగింది. అదనంగా, రాష్ట్ర శాసనసభలో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడమయింది. స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పోస్టులలో 34 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా మేము పనిచేస్తున్నాం. ఈ సామాజిక వర్గానికి దీర్ఘకాలిక సంక్షేమం మరియు హక్కులు కల్పించేలా చూస్తూ, ప్రత్యేక బిసి పరిరక్షణ చట్టాన్ని చేయడం కోసం మేము రోడ్ మ్యాప్ను రూపొందించాం.
- మేము ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.15,000/-లకు, నాయీబ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.25,000/-లకు పెంచడం జరిగింది. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3,000/-ల భత్యాన్ని ఇవ్వడమవుతున్నది. వరుసగా రూ.10,000/-, రూ.5,000/- చెల్లిస్తున్న ఇమామ్లు, మౌజాన్లకు పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది.
- మహిళల సంక్షేమం కోసం, మా ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రవేశపెట్టింది, ఇది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది, ఇది అవసరమైన వంట ఇంధనం అందుబాటులో ఉండేలా చేస్తుంది మరియు జీవన నాణ్యతను పెంచుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల్లోని మహిళల జీవన నాణ్యతను పెంచుతుంది. ఇందువల్ల ఇప్పటివరకు రూ.686 కోట్ల మొత్తం పంపిణీతో ఇప్పటికే 86.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
- “అందరికీ ఇల్లు” పేరిట అవసరమైనచోట ఇంటి స్థలాలను తగువిధంగా సమకూరుస్తూ సంతృప్తత విధానంలో 2029 చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలన్నింటికీ శాశ్వత గృహాలను సమకూర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 8 నెలల్లో రూ.642.38 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి, పిఎంఏవై అర్బన్ – బిఎల్సి : 76585 గృహాలు, పిఎంఏవై గ్రామీణ : 37746 గృహాలు మరియు పిఎం జన్మన్-305 గృహాల క్రింద 1.14 లక్షల గృహాలను పూర్తి చేయడమయింది. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, స్వచ్ఛమైన నీరు, వంటగ్యాస్, విద్యుత్, సుస్థిర ఇంధనం కోసం సోలార్ పైకప్పు కూడా అందుబాటులో ఉండేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూమి లేని కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని సమకూరుస్తూ పెండింగ్లో ఉన్న 6.34 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు మేము చురుగ్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికి పట్టణ మరియు గ్రామీణ పేదల కోసం 4 నుండి 5 లక్షల ఇళ్ళను పూర్తి చేయనున్నాం.
- కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థ (ఎఫ్బిఎంఎస్) – ప్రతి కుటుంబం అవసరమైన సేవలు మరియు మద్దతును సమర్థవంతంగా పొందేలా చూస్తూ పథకం ప్రయోజనాలు మరియు ఇతర సంక్షేమ చర్యల పంపిణీని క్రమబద్ధీకరించడానికి, నా ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును ఆవిష్కరించాలని యోచిస్తోంది. “ఎవరైనా ఒక మనిషికి ఒక చేపను ఇస్తే, అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే, జీవితాంతం తిండి పెట్టినట్లవుతుంది” అనే సూక్తిని గౌరవ ముఖ్యమంత్రిగారు గట్టిగా సమర్థిస్తున్నారు. అర్హులైన పౌరులందరికీ అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను సమకూరుస్తూనే వారి ప్రయోజనాలను సకాలంలో పొందేలా వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తున్నది.
- సంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు, నా ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తోంది, ఇక్కడ అధిక-నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐలు) అవసరార్ధులకు మరియు నిరుపేదలకు అండగా ఉంటారు. సమాజ అభ్యున్నతి యొక్క ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మన ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారిచే రూపొందించబడిన ప్రభుత్వ-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం అనే ఒక వినూత్న P4 విధానానికి మేము నాంది పలుకుతున్నాం. అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి మద్దతు ఇవ్వడానికి మన జనాభాలోని అగ్రస్థాయిలోని పది శాతం మందిని నిమగ్నం చేయడం ద్వారా, పేదరికం నుండి స్థిరమైన మార్గాలకు మార్గం సుగమం చేస్తూ సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు లక్షిత సహాయాన్ని అందించేలా చూస్తుంది.
- ఈ విధంగా, సమిష్టి దార్శనికత, ఆలోచనలు, అంకితభావంతో కూడిన కార్యక్రమాలు స్థూల స్థాయిలో ప్రణాళికలు రచించి, సూక్ష్మస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రతి పౌరుడికి సుసంపన్నమైన, స్వావలంబన, గౌరవప్రదమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ పేదరికంలేని సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నాయి.
మానవ వనరుల అభివృద్ధి మరియు జనాభా నిర్వహణ
- సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్యం, ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మూలస్తంభమని నా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. ఈ దార్శనికతకు అనుగుణంగా విద్య, ఆరోగ్య రంగాలపై వ్యూహాత్మక దృష్టి సారించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని మేము బలోపేతం చేస్తున్నాం.
- సృజనాత్మక మరియు వ్యయ ప్రభావక పరిష్కారాలతో నివారణ మరియు నిర్మూలన అనే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మక జోక్యాలను ఉపయోగించడం ద్వారా నా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సుమారు రూ.1770 కోట్ల మేర పెండింగ్లో ఉన్న అప్పులను తీర్చి, ఎన్టిఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వంటి కీలక పథకాలను పునరుద్ధరించడం జరిగింది. మా ఎన్డిఏ ప్రభుత్వం హైబ్రిడ్ ఆరోగ్య బీమాను ప్రతిపాదిస్తున్నది. ఇందులో రూ.2.5 లక్షల క్లెయింలను ఇన్సూరెన్స్ పార్ట్నర్ రీయింబర్స్ చేస్తారు. రూ.2.5 లక్షలకు మించి రూ.25 లక్షల వరకు గల క్లెయింలను ఎన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు రీయింబర్స్ చేస్తుంది. ప్రతి శానససభ నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని మా ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. ముందస్తు చొరవకు వీలుకల్పిస్తూ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి వేలాది కొత్త కేసులను మరియు సంభావ్య క్యాన్సర్ కేసులను గుర్తిస్తూ 92.4 లక్షల మంది వ్యక్తులకు ఇప్పటికే ఆరోగ్య పరీక్షలను నిర్వహించడమయింది.
- వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యం మధ్య అనుసంధానంపై దృష్టి పెట్టడం ద్వారా మన జనాభా యొక్క మారుతున్న ధోరణులను కూడా మేము పరిష్కరిస్తున్నాం. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు మరియు సేంద్రీయ ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు మరియు ఆంధ్రప్రదేశ్ ఈ మార్పులో అగ్రగామిగా ఉంది. సాంకేతికత, నివారక సంరక్షణ మరియు సంపూర్ణ ఆరోగ్య విధానాలను సమ్మిళితం చేయడం ద్వారా, మేము ఆరోగ్యకరమైన, మరింత సమర్ధవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నాం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం.
- మన సమాజ మూలాలను పటిష్టపరచడానికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్యా సంస్కరణలను నా ప్రభుత్వం అమలు చేస్తున్నది. సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా మేము దేశంలోనే మొట్టమొదటి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ను నిర్వహించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ అనే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మేము తిరిగి రూపకల్పన చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించనున్నాం. ‘మనబడి – మన భవిష్యతు’ వంటి కార్యక్రమాల ద్వారా మేము మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నాం.
- జాతీయంగా, అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించేలా చూస్తూ, మేము ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలను పెంపొందించేందుకు కొత్త దృక్పథాలను, నాయకత్వాన్ని తీసుకువస్తూ ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి, సుస్థిర కార్యవిధానాలను అనుసరించి, పూర్తిగా ప్రతిభ ఆధారంగా మేము 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాం.
- ఆంధ్రప్రదేశ్ గణనీయమైన జనాభా పరివర్తనలకు లోనవుతోంది, వీటిలో సంతాన సాఫల్యత రేటు (టిఎఫ్ఆర్) లో తీవ్రమైన క్షీణత మరియు వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడం, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థల క్షీణత చేరి ఉన్నాయి, ప్రతి ఒక్కటి దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉన్నాయి. ‘డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్’ పై ఒక విధానాన్ని ప్రారంభించడం ద్వారా తగ్గుతున్న శ్రామిక శక్తి, వృద్ధాప్య జనాభా మరియు మారుతున్న కుటుంబ ధోరణుల పర్యవసాన ప్రభావాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు మించకూడదు అనే నిబంధనను మేము ఇప్పటికే రద్దు చేశాం. అంతేకాకుండా, మా హామీలకు అనుగుణంగా పిల్లల చదువులు కుటుంబానికి భారంగా మారకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయబోతున్నాం.
- దూరదృష్టి, లక్ష్యసాధనతో, సుస్థిర ఆర్థికాభివృద్ధికి పునాది వేస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తున్నది.
ఉపాధి, నైపుణ్యం
- విద్య, నైపుణ్యాల పెంపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి కేంద్ర బిందువులు. నైపుణ్యాల ఆఫ్లైన్, ఆన్లైన్ అప్గ్రేడేషన్పై దృష్టిసారిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గుర్తించడానికి రాష్ట్రం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహిస్తోంది.
- అభివృద్ధికి ‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’ అనే అంశంపై దృష్టిసారిస్తూ ఉపాధికల్పనకు బలమైన పునాది వేయడమే మా ప్రభుత్వ సమగ్ర విధానం. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ తీసుకొచ్చే వృత్తులకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తికరమైన పనిని స్వీకరించడం జరిగింది. వారి వ్యవస్థాపక స్ఫూర్తి వారిని అవకాశాలను చురుకుగా ఉపయోగించుకోవడానికి ప్రేరేపిస్తుంది, నైపుణ్యాలను స్థిరమైన జీవనోపాధిగా మారుస్తుంది.
- నైపుణ్యాలను పెంపొందించడానికి, మేము నైపుణ్య బదిలీ నమూనాను అనుసరిస్తున్నాం. దీని క్రింద స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చడానికి నిరుద్యోగ యువత, కళాశాల డ్రాపవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డిగ్రీ కళాశాలల్లో 200 స్కిల్ హబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం క్రింద, 4,700 ఎకరాల్లో 800పైగా భూ కేటాయింపులను విజయవంతంగా నిర్వహించి, రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడమయింది.
- కీలక ఉపాధికల్పన రంగంగా ఉన్న పర్యాటకం సమాజాలలో సాధికారత తీసుకురావడంలో, సుస్థిర వృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 రాష్ట్రం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం, వైద్యం మరియు ఎకో టూరిజం సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తున్నది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు పచ్చదనం కార్యకలాపాలను ఏకీకృతం చేస్తూ సుస్థిర పర్యాటకంపై రాష్ట్రం దృష్టిసారిస్తున్నది.
- ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, పర్యాటకం వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టిసారిస్తూ బ్లూ, వైట్ కాలర్ ఉద్యోగాలతో సహా అన్ని కేటగిరీల్లో ఉపాధిని కల్పించడం ఆంధ్రప్రదేశ్ సమగ్ర వ్యూహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్, అపెరల్ అండ్ గార్మెంట్ పాలసీ 2024 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కుల ద్వారా ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- అట్టడుగున ఉన్న సంప్రదాయ వృత్తులకు మద్దతును అందించే మా చర్యలలో భాగంగా మేము అనేక చొరవలను చేపట్టాం. ఉదాహరణకు, గీత కులాల వారి కోసం మేము 10 శాతం దుకాణాలను రిజర్వు చేసి, రాయితీతో కూడిన 50 శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఆర్ఈటి)ను అందించాం. నైపుణ్యం కలిగిన ప్రతి కార్మికుడు, పారిశ్రామికవేత్త తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన మద్దతును పొందేలా ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తున్నది.
- ఆంధ్రప్రదేశ్ ఐటి & జిసిసి పాలసీ (2024–2029) ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా భారతదేశ ఐటి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని భావిస్తున్నది. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేసెస్, డేటా ఆధారిత గవర్నెన్స్కి ఈ విధానం ప్రాధాన్యత ఇస్తుంది.
- ఇలాంటి వ్యూహాత్మక చొరవలు, అచంచలమైన నిబద్ధత ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఉపాధి, అధునాతన నైపుణ్యానికి కేంద్రంగా రూపాంతరం చెందుతున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడానికి లేదా ఉపాధి భత్యం ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం.
నీటి భద్రత
- ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, సమాన పంపిణీ, వ్యవసాయ స్థితిస్థాపకత కోసం నదుల అనుసంధానం, సంరక్షణ చర్యల ద్వారా అన్ని రంగాల్లో నీటి వినియోగాన్ని గరిష్టతరం చేయడాన్ని కట్టుదిట్టం చేస్తూ నీటి సురక్షిత భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. నీటికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి మరియు కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన వినియోగదారులందరికీ నీటి లభ్యతను సులభతరం చేయడానికి, గృహ అవసరాలు, పారిశ్రామిక, వ్యవసాయ మరియు ఇతర వినియోగదారులకు నీటిని అందించేందుకు ఒక కొత్త రాష్ట్ర జల విధానాన్ని రూపొందించడమవుతున్నది.
- సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమయింది. సాగునీటి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాలను పూర్తిగా ఉపేక్షించడంతో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మా ప్రభుత్వం తిరిగి దృష్టిసారించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తున్నాం. మన జీవనాడి అయిన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు 73 శాతం పురోగతి సాధించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా 28.50 లక్షల మందికి లబ్ధిని చేకూరుస్తూ, 540 గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తుంది. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి 960 మెగావాట్ల జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను బేఖాతరు చేస్తూ, నిర్మాణం కీలక దశలో ఉన్నప్పుడు అమలు చేసే ఏజెన్సీని ఆకస్మికంగా మార్చడం వల్ల డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి దారితీసి, ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణమయింది. ఒకప్పుడు పట్టాలు తప్పి, ఆలస్యమైన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కి 2027 నాటికి దాని వాస్తవ స్థాయికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది.
- కరవు రహిత రాష్ట్ర లక్ష్యాన్ని సాధించే దిశగా, మా ప్రభుత్వం పోలవరం నుండి బనకచెర్ల నదీ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇది లింక్ కాలువ ద్వారా గోదావరి నది నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు నీటిని బదిలీ చేస్తుంది. ఈ పరివర్తనాత్మక ప్రాజెక్టు కేవలం సాగు నీటిపారుదలకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది జీవితాలను మార్చడం, కరువును అభివృద్ధిగా, కొరతను సమృద్ధిగా మరియు నిరాశను నమ్మకంగా మారుస్తున్నది. ఒకప్పుడు సుదూర స్వప్నంగా ఉన్న నీరు ఇప్పుడు సాకారమై, రాయలసీమను నీటి సురక్షిత ప్రాంతంగా మార్చనుంది.
- అమృత్ & జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. మనం ఈ అవకాశాన్ని కోల్పోయినపుడు, ఇతర రాష్ట్రాలు వాటిని పెద్ద ఎత్తున అమలు చేశాయి. జెజెఎం విషయంలో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కేవలం రూ.2,255 కోట్లు మాత్రమే వినియోగించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది. దీనిని ఇప్పుడు నా ప్రభుత్వం పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, ప్రతీ కుటుంబానికి కుళాయి నీరు అందేటట్లు చేయడానికి గానూ, నిధులను వినియోగించుకోవాలనీ మరియు 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలన్నింటికీ వర్తింప చేయాలని మేము పూర్తిగా నిశ్చయించుకున్నాం.
- రాయలసీమకు కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) వంటి ఇతర కీలక ప్రాజెక్టులు 1వ దశలో 94 శాతం, 2వ దశలో 82 శాతానికి చేరుకున్నాయి, ఇవి సుమారు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 437 గ్రామాల్లోని సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందిస్తాయి. వీటితోపాటు వెలిగొండ ప్రాజెక్టు 75 శాతం పూర్తయింది. ఇది ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలలోని కరువుపీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- జలహారతి కార్యక్రమం ద్వారా, ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందిస్తూ, దానిని భూమాతకు అర్పణగా పరిగణిస్తూ రైతుల శ్రేయస్సుకు, ఆశలకు ప్రతీకగా నిలుస్తూ, మేము నదులు, జలాశయాలకు పూజలు చేస్తున్నాము. లక్ష్యం స్పష్టంగా ఉంది : ఏ భూమీ బంజరు భూమిగా మిగిలిపోకూడదు మరియు ఏ రైతూ నీటి కొరతను ఎదుర్కోకూడదు.
- ఈ చొరవల ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటి భద్రత, వ్యవసాయపరంగా సుసంపన్నమైన, పర్యావరణపరంగా సుస్థిర భవిష్యత్తుకు పునాది వేస్తోంది.
రైతు – వ్యవసాయ సాంకేతికత
- వ్యవసాయం ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్కు వెన్నెముకగా ఉంది మరియు రాష్ట్రం ఇప్పుడు రైతు – వ్యవసాయ సాంకేతిక జోక్యాల ద్వారా ఈ రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు సుస్థిరంగా మార్చడానికి రూపాంతరం చెందుతోంది. కేవలం ఆహార ఉత్పత్తి నుంచి ఆహార ప్రాసెసింగ్ వైపుకు మళ్లించడం, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం మరియు రైతులకు కొత్త అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించింది. రైతులు తమ ఉత్పత్తులకు ఉత్తమ రాబడి పొందేటట్లు చేయడానికిగాను వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, సరఫరా చైన్ సామర్థ్యం, శీతల గిడ్డంగి సౌకర్యాలకు మద్దతు ఇవ్వడానికి విధానాలను అమలు చేయడమవుతున్నది.
- నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను అవలంభించాలనే తపనతో ఉన్న వినూత్న మరియు అభ్యుదయ రైతులకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నిలయంగా ఉంది. అయితే, గత పాలనా వ్యవస్థ దుష్పరిపాలన కారణంగా, ఈ విధానాలు ఎంతో మంది రైతులను నిరాశ అంచులకు నెట్టాయి. నేడు, ఏ రైతు కూడా కష్టాల్లో లేరని చెప్పడానికి మేము గర్విస్తున్నాము మరియు సకాలంలో నీటి సరఫరా మరియు పరివర్తన ప్రాజెక్టుల కారణంగా 2024-25 లో స్థూల విలువ జోడింపు (జివిఎ) 22.86% మేరకు పెరిగింది.
- రుతుపవనాలకు ముందు మరియు తరువాత నీటి లోతు స్థాయిలపై దృష్టి సారించి తగిన భూగర్భ జలాల రీఛార్జ్ చొరవలను ప్రణాళిక చేయడం మరియు అవలంభించడం ద్వారా భూగర్భ జల మట్టాలను 20 మీటర్ల నుండి 8-20 మీటర్ల స్థాయికి మరియు 8-20 మీటర్ల నుండి 3-8 మీటర్ల కంటే మించిన స్థాయికి మెరుగుపరచాలని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
- చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం అసమానమైనది, ఇది భారతదేశం యొక్క మొత్తం చేపల ఉత్పత్తిలో 29.1 శాతం మరియు దేశంలో సాగుచేసిన రొయ్యల ఉత్పత్తిలో 75 శాతానికి పైగా దోహదం చేస్తుంది. 2.26 లక్షల హెక్టార్లలో చేపల పెంపకం క్రింద, ఈ రంగం గ్రామీణ శ్రేయస్సును అభివృద్ధి చేస్తున్నది మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నది. నిజాంపట్నంలో రూ.88.08 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆక్వా పార్కును అభివృద్ధి చేయడం, చేపల పెంపకంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో మత్స్యపరిశ్రమల రంగాన్ని కూడా రాష్ట్రం బలోపేతం చేస్తోంది.
- క్రెడిట్ మరియు మద్దతు వ్యవస్థలను మెరుగైన ప్రాప్యతను నిర్ధారిస్తూ, కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కుల కార్డుల ద్వారా సాధికారత కల్పిస్తున్న సమయంలో, సకాలంలో సాంకేతిక సమాచారంతో రైతులకు చేయూతనిచ్చేందుకు, పాడి-పంటలు ఛానల్ను ఏర్పాటు చేయడమయింది. డి-క్రిషి యాప్, ఇన్సైట్ యాప్, ఐఎఫ్ఎంఎస్ పోర్టల్, చీడలు & తెగుళ్ళ నిఘా వ్యవస్థ వంటి అనేక అప్లికేషన్లు రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలలో సాంకేతికతను సమీకృతం చేస్తున్నాయి.
- రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రకృతి సేద్య అనుసరణను 10.68 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మంది రైతులకు పెంచడానికి, విస్తీర్ణాన్ని 4.95 లక్షల హెక్టార్ల నుంచి 20 లక్షల హెక్టార్లకు పెంచి, ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా చేయాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్య పద్ధతులను అవలంభించేలా మేము రైతులను ప్రోత్సహిస్తున్నాం.
- మన పండ్లు, పూలు మరియు చేపల పెంపక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుకోవడంతో మనం ఎగుమతులలో ముందంజలో ఉన్నాం. ఉద్యానవన రంగంలో, విస్తృత సాంకేతికత 1.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చగా, రాష్ట్రం ఉద్యానవన రంగాన్ని వాణిజ్యపరంగా విస్తరించి, 46,000 హెక్టార్లను సాగులోకి తెచ్చింది. డ్రాగన్ ఫ్రూట్, అరటి, నారింజ వంటి పండ్ల సాగు ద్వారా మనం అంతర్జాతీయ ప్రశంసలను పొందుతున్నాం. భావితరాలకు గొప్ప జీవావరణాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడంపై మా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. 2047 వరకు ప్రతి సంవత్సరం 1 శాతం వృద్ధితో 50 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రధానంగా ఉద్యానవన రంగంపై దృష్టిసారిస్తున్నది.
- గత అయిదేళ్లుగా, రైతులను ప్రభావితం చేస్తున్న జాప్యాలు, నష్టాలతో ఆంధ్రప్రదేశ్లో వరి సేకరణ గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొంది. నేడు, మేము ఈ వ్యవస్థను మార్చాము. సేకరణ అంతరాయం లేనిదిగా మరియు రైతులు ఇకపై ఎక్కువ కాలం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా చూసుకోవడానికి మేము 48 గంటల్లో బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు 5.24 లక్షల మంది రైతులకు మొత్తం రూ.7,555 కోట్లను పంపిణీ చేయడమయింది.
- మానవ ఆరోగ్యం ఎంత ముఖ్యమో, భూసార పటిష్టత కూడా అంతే ముఖ్యం. సుస్థిర వ్యవసాయ పద్ధతులను నిర్ధారిస్తూ, నేల సూక్ష్మపోషకాలను పర్యవేక్షించడానికి మరియు పెంచడానికి మేము ఐఓటి మరియు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. అదనంగా, గ్రామీణ కుటుంబాలకు జీవనాడి అయిన పాడి పరిశ్రమ ఆధునిక పద్ధతులు మరియు సహాయక వ్యవస్థలతో పునరుజ్జీవింప చేయబడుతోంది. తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్న రైతుల కోసం సత్వర సహాయ పునరావాసాన్ని అందించడానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడానికి నా ప్రభుత్వం బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నది.
- ఈ సమీకృత, సాంకేతిక ఆధారిత చొరవలపై దృష్టిసారించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా లాభదాయకంగా మరియు సుస్థిరంగా ఉండే స్థితిస్థాపక వ్యవసాయ రంగాన్ని నిర్మిస్తోంది.
ప్రపంచ ఉత్తమ వ్యూహరచనలు
- మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు మల్టీ మోడల్ రవాణా కేంద్రాలను నా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అవి మన రాష్ట్రాన్ని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే కొత్త వాణిజ్య కారిడార్లను ఏర్పాటు చేస్తాయి. బహిరంగ వర్తక విధానాన్ని అమలు చేయడం, తదుపరి తరం కమ్యూనికేషన్ (4జి, 5జి మరియు 6జి) కోసం టెలికం స్పెక్ట్రమ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు విస్తృత డిజిటల్ కనెక్టివిటీని నిర్ధారించడం ద్వారా రాష్ట్రం ప్రపంచ స్థాయి డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలను కలిగివుండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమీకృత మౌలిక సదుపాయాల నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ వర్తకం కోసం ప్రాధాన్యత గల గేట్వేగా చేస్తుంది.
- 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం, వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రంగా రూపుదిద్దుటకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతమున్న 10 పోర్టులన్నింటినీ ప్రపంచ స్థాయి ఓడరేవులుగా మేము తీర్చిదిద్దుతున్నాము.
- మునిసిపల్ సర్వీసెస్ మొబైల్ యాప్ యొక్క ఆంధ్రప్రదేశ్ కన్సిస్టెంట్ మానిటరింగ్ ద్వారా కూడళ్ళ మెరుగుదలలు, పూర్తి మన్నికగల రోడ్డును వేయడం మరియు రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పట్టణ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడమవుతున్నది. వైజాగ్, విజయవాడలలో రాబోయే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ (ఎంఆర్టిఎస్) పట్టణ చలనశీలతను మారుస్తుంది మరియు అనుసంధానతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. 2029 నాటికి, వైజాగ్ 46.23 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ను కలిగి ఉండగా, విజయవాడలో 38.40 కిలోమీటర్ల నెట్వర్క్ కలిగి ఉంటుంది. రూ.22,507 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు రవాణా మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.
- మన రాష్ట్రం అన్ని శాఖల సమీకృత చర్యల ద్వారా గ్రామీణ మరియు పట్టణ లాజిస్టిక్ల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నది. జాతీయ రూర్బన్ మిషన్ (ఎన్ఆర్యుఎం) క్రింద, గ్రామీణ-పట్టణ అనుసంధానాలను గణనీయంగా బలోపేతం చేస్తూ 13 క్లస్టర్లలో 2,933 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటర్ షెడ్లు, వీధిదీపాలు మరియు పారిశుద్ధ్య సదుపాయాలు వంటి వివిధ చొరవల ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను నా ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో, సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమయింది మరియు సిసి రోడ్లు, బిటి రోడ్లు, పశువుల షెడ్లు మున్నగువాటితో కూడిన 30,000 పనులను మంజూరు చేయడమయింది. 4,300 కి.మీ.ల సిసి రోడ్లను మంజూరు చేయడమయింది. వాటిలో 3,000 కి.మీ.లు పూర్తయ్యాయి మరియు 1300 కి.మీ.లు తుది దశలో ఉంది.
- రోడ్డు పరిస్థితులను పునరుద్ధరించడానికి ప్రారంభించిన మిషన్ పాట్ హాల్-ఫ్రీ ఆంధ్రా అద్భుతమైన పురోగతిని సాధించింది. మరమ్మతుల కోసం చేపట్టిన 20,059 కి.మీ.లకుగానూ, కేవలం 3 నెలల్లో 17,605 కి.మీ.ల పనిని పూర్తి చేయడమయింది. రాష్ట్ర రహదారులపై ప్రత్యేక దృష్టిసారిస్తూ, జిల్లా ప్రధాన కార్యస్థానం నుండి మండల ప్రధాన కార్యస్థానం వరకు మరియు ఆనుకొని ఉన్న మండల కార్యస్థానాల మధ్య డబుల్ –లేన్ కనెక్టివిటీని చేపడుతున్నది.
- నిరంతర అనుసంధానత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో లాజిస్టిక్ సౌకర్యాలు మరియు వ్యవసాయ సంబంధిత ఎగుమతి విశిష్టతలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బెంచ్ మార్క్ను అందుకొంటున్నది. నాణ్యత మరియు తగ్గిన రవాణా సమయాలను నిర్ధారిస్తూ అధునాతన సరఫరా పరంపరతో, రాష్ట్రం ఉద్యానవనరంగం మరియు ఆక్వాకల్చర్లో ప్రమాణాలను నెలకొల్పుతున్నది. లాజిస్టిక్స్ మరియు ఉత్పత్తుల యొక్క ఈ ఏకీకరణ అధిక-నాణ్యతా ఎగుమతులు మరియు సుస్థిరమైన వృద్ధి కోసం రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ స్థాయిలో ఉంచుతున్నది.
- రాష్ట్రాన్ని ప్రపంచ వర్తక మరియు వాణిజ్యానికి ప్రముఖ కేంద్రంగా మార్చడానికి వినూత్న వ్యూహాలు మరియు సహకార చర్యలతో, ఆంధ్రప్రదేశ్ ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్లు మరియు ఫిషింగ్ హార్బర్లతో ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల దిశగా పురోగమిస్తోంది.
వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి ఇంధనం ఒక కీలక అంశం, ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ చొరవలతో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇంధన రంగంలో వ్యయ నియంత్రణలో విద్యుత్ & ఇంధన శాఖ యొక్క అచంచలమైన నిబద్ధత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుస్థిరతను పునర్నిర్మిస్తోంది.
- 2024, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇంధన ఉత్పత్తి మరియు వినియోగంలో స్వయం స్వావలంబన సాధించాలన్న రాష్ట్ర లక్ష్యంతో కలుపుకొని 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 7.5 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకోవడమయింది. సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (4.0) ఏపిఎస్ఆర్టిసి వాహనాలన్నింటిని 100% విద్యుదీకరణ చేయడానికి సంబంధించిన ప్రణాళికలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో కీలక పాత్ర పోషించనుంది.
- మొత్తం విద్యుత్ రంగాన్ని పునర్ నిర్మించడం ద్వారా ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో నా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది మరియు ఈ సంస్కరణల ద్వారా 2025-26 లో విద్యుత్ ఛార్జీలు పెరుగుదల లేకుండా కట్టుదిట్టం చేస్తున్నాం. ఈ దార్శనికతలో భాగంగా, క్లీన్ ఎనర్జీ లభ్యతను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్రంలోని సుమారు 20 లక్షల ఎస్సి, ఎస్టి కుటుంబాలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే పిఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజనను రాష్ట్రం ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రం ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ సోలార్ను కూడా ఏర్పాటు చేస్తున్నది. వీటితోపాటు, రాష్ట్రంలోని రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్రం వ్యవసాయ ఫీడర్లను కూడా సోలరైజేషన్ చేస్తోంది.
- కుప్పం నియోజకవర్గంలో గృహ, వ్యవసాయ వినియోగదారులు, ప్రభుత్వ భవనాలను 100 శాతం సోలరైజేషన్ సాధించి సుస్థిరాభివృద్ధికి కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సుస్థిర, సమర్ధ ఇంధన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను బలోపేతం చేస్తూ కుప్పం నియోజకవర్గం నూటికి నూరు శాతం సోలరైజేషన్కు ఒక నమూనా నియోజకవర్గంగా ఉంటుంది.
- గ్రీన్ హైడ్రోజన్ కోసం ఎండ్-టు-ఎండ్ పర్యావరణ వ్యవస్థను కూడా రాష్ట్రం నిర్మిస్తోంది, ఇది ప్రపంచ ఇంధన పరివర్తనలో ముందంజలో ఉండేలా నిర్ధారిస్తుంది. హైడ్రోజన్ వ్యాలీ చొరవ 1,200 టిపిడి గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నమైన గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఎఎఫ్), గ్రీన్ యూరియా మరియు ఇతరములు ఉత్పత్తి చేయడం ద్వారా గ్లోబల్ బెంచ్ మార్కును నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.
- సృజనాత్మక విధానాలు మరియు సమర్థవంతమైన పరిష్కారాలతో, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మరియు ఇంధనానికి సంబంధించిన వ్యయ నియంత్రణలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సమీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భాగస్వాములందరికీ ఇంధన ఖర్చులను తగ్గించడానికి మేము సౌరశక్తి, పవనశక్తి, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ మరియు బ్యాటరీ స్టోరేజిలో మా సామర్థ్యాలను విస్తరిస్తున్నాము. సామాన్య వ్యక్తికి భారం లేకుండా, మెరుగైన సామర్థ్యం మరియు సృజనాత్మకత ద్వారా ప్రతి యూనిట్ వ్యయాన్ని తగ్గించడమే మా లక్ష్యం. రాబోయే రోజులలో సగటు సేకరణ ఖర్చులను ప్రస్తుత స్థాయి నుండి కనిష్ట స్థాయికి తగ్గించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉత్పత్తి పరిపూర్ణత
- ఆవిష్కరణ, నాణ్యత మరియు ప్రపంచ పోటీతత్వాన్ని నడిపించే ఉత్పత్తి పరిపూర్ణ పర్యావరణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోంది. సంపద సృష్టిని వేగవంతం చేస్తూ, ఈ పర్యావరణ వ్యవస్థ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ఉత్పత్తి పరిపూర్ణత అనేది “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్”ను ప్రపంచ విశిష్టతకు చిహ్నంగా మార్చేటట్లు చేయడం కోసం ఈ ఎన్.డి.ఏ. ప్రభుత్వం యొక్క అచంచలమైన నిబద్ధత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడం, ఉత్తమ పద్ధతులను అవలంబించడం మరియు బలమైన నాణ్యతా నియంత్రణ వ్యవస్థలను అమలు చేయడం ద్వారా, మేము మా ఉత్పత్తులను అత్యంత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుస్తున్నాం.
- మా ఉత్పత్తుల విశిష్టతను చాటడానికి భౌగోళిక గుర్తింపు (జిఐ) ట్యాగ్లను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడానికి నా ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. అత్యుత్తమ వస్త్రాల నుండి సంపన్న వ్యవసాయోత్పత్తుల వరకు, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ లేబుల్ ఉన్న ప్రతి వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం, గుర్తింపు లభిస్తుంది. ఒక ఉత్పత్తిని చూడటంతోనే దాని వారసత్వం, దాని సృజనాత్మకత మరియు పరిపూర్ణత కోసం అలుపెరగని అన్వేషణ గురించి ప్రపంచానికి గుర్తు చేసేలా ఆంధ్రప్రదేశ్కు ఒక శక్తివంతమైన బ్రాండ్గా గుర్తింపును సృష్టించడం మా దార్శనికత. అందరం కలిసి నాణ్యత, విశ్వాసం, ప్రపంచ నాయకత్వ వారసత్వాన్ని నిర్మించుకుంటున్నాం. మార్కెట్ ప్రమేయం ద్వారా ప్రకటించిన అన్ని పంటల కోసం రైతులకు కనీస మద్దతు ధరను స్థిరపరచాలని మా ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నది. అదనంగా, కేంద్ర ప్రభుత్వ సహాయంతో టమాటా మరియు మిరప పంటల కోసం మార్కెట్ ప్రమేయ పథకం ద్వారా కనీస మద్దతు ధరను నిర్ధారించడానికి మేము పనిచేస్తున్నాము.
- నాణ్యత, విశిష్ఠతకు ప్రమాణాలను నిర్దేశిస్తూ, ఉద్యానవన రంగం, ఆక్వాకల్చర్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రగామిగా అవతరించింది. భారతదేశపు అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా, దేశం మొత్తం ఉత్పత్తిలో 15.6 శాతం వాటాను అందిస్తూ ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా మరియు కొబ్బరి వంటి కీలక పంటల ఉత్పాదకతలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో 11 కీలక పంటలకు క్లస్టర్ ఆధారిత విలువ చైనులను సుస్థిర అభివృద్ధి, మార్కెట్ పోటీతత్వానికి తగ్గట్టుగా ప్రోత్సహిస్తుంది. ఈ-మిర్చా కార్యక్రమం మిరప ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగిస్తోంది.
- అత్యాధునిక ఆవిష్కరణలు మరియు శ్రేష్టతకై నిబద్ధత, లాభదాయకమైన వ్యవసాయం కోసం భాగస్వాములందరిని సంప్రదించి మరియు దానిలో భాగమయ్యేలా 360 డిగ్రీ విధానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి పరిపూర్ణతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది మరియు నాలెడ్జి ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తోంది.
స్వచ్ఛాంధ్ర :
- స్వచ్ఛాంధ్ర పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మరింత సుస్థిర ఆంధ్రప్రదేశ్ కోసం మన సమగ్ర దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఈ చొరవ భౌతిక పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ మరియు పనిప్రాంత పరిశుభ్రతకు మించి ఉంటుంది. ఇది ఆలోచనల స్వచ్ఛత, ఆరోగ్యకరమైన జీవనం మరియు మన పరిసరాల పట్ల సమిష్టి బాధ్యతను పెంపొందిస్తుంది. నా ప్రభుత్వం వ్యర్థాలను వేరుచేయడం, చెత్తను తగ్గించడం మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ స్పృహ కలిగిన పద్ధతులను అవలంభించడానికి పౌరులను ప్రోత్సహిస్తోంది.
- 15,948 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించడం, 70 శాతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణను అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్యంలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. అదనంగా, 7,559 ఘన వ్యర్ధాల ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి, 2025-26 లో 40,000 ఇంకుడు గుంతలు మరియు 20 లక్షల గృహ కంపోస్ట్ గుంతల కోసం ప్రణాళికలు పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణను పెంచుతాయి. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమం ద్వారా మేము పరిశుభ్రత, సుస్థిరతను ప్రోత్సహిస్తున్నాం. సుస్థిర ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిసారించి స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశను అమలు చేస్తున్నాం. ప్రతినెలా 3వ శనివారం “స్వచ్ఛాంధ్ర దినోత్సవం”గా పాటిస్తూ పరిశుభ్రత కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తున్నాం.
- పారిశ్రామిక, ఎలక్ట్రానిక్, వ్యవసాయ వ్యర్థాల వినియోగంలో వలయాకార ఆర్థిక వ్యవస్థ ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటూ దేశంలోని మిగలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్ధ ప్రవాహాల నుంచి వచ్చే విషపూరిత నీరు ఒక ముఖ్య సమస్యగా ఉండేది, కానీ నేడు, మేము ఈ సవాలును అవకాశంగా మారుస్తున్నాము. అధునాతన శుద్ధి ప్రక్రియల ద్వారా, విషపూరితమైన నీటిని సురక్షితమైన పునర్వినియోగ నీరుగా మార్చబడుతున్నది. ఈ వినూత్న విధానం కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయ మార్గాలను కూడా సృష్టిస్తుంది.
- పరివర్తనా కార్యక్రమాలు మరియు సమాజ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకు స్థిరత్వం మరియు పర్యావరణ సామరస్యం యొక్క వారసత్వాన్ని నిర్మిస్తూ, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్వచ్ఛాంధ్ర దిశగా పురోగమిస్తోంది.
విస్తృత సాంకేతికత ఏకీకరణ
- పరిపాలన, సర్వీస్ డెలివరీ, రిసోర్స్ మేనేజ్మెంట్ను పెంచడం ద్వారా అన్ని రంగాల్లో విస్తృత సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పరివర్తనకు నా ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది. ఏఐ, బ్లాక్ చెయిన్, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) పరిపాలనా ప్రతిస్పందనలో సమర్థత, పారదర్శకతను పెంచుతున్నాయి. సర్వీస్ డెలివరీ మరియు నిర్వహణ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి విస్తృత సాంకేతికత ప్రభుత్వం యొక్క భౌతిక మౌలిక సదుపాయాలను భర్తీ చేస్తోంది.
- పరిపాలనా ప్రతిస్పందనను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, కంప్యూటర్ విజన్ మరియు డ్రోన్లను ఉపయోగిస్తూ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) 4.0 ఈ డిజిటల్ పరివర్తనలో ముందంజలో ఉంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. 161 పౌరసేవలు అందిస్తూ ‘మన మిత్ర’ అనే వాట్సప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఇది డిజిటల్ గవర్నెన్స్కు జాతీయ ప్రమాణాలను నిర్దేశించింది. డిజిటల్ శాండ్ ట్రాకింగ్, జిపిఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ, డ్రోన్ సర్వేలతో ఆంధ్రప్రదేశ్ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ వంటి ఇతర కార్యక్రమాలు వనరుల నిర్వహణను క్రమబద్ధీకరించాయి.
- ఆంధ్రప్రదేశ్ అపూర్వమైన సామర్ధ్యం మరియు పారదర్శకత కోసం కృత్రిమ మేధ (ఏఐ), విప్లవాత్మక పాలన, చట్ట అమలు మరియు ప్రజా సేవల ద్వారా జీవితంలో పూర్తి పరివర్తనను తీసుకువస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతి ద్వారా సాధికారత పొందిన ఆంధ్రప్రదేశ్ జీవితంలోని అన్ని రంగాలలో విస్తృత సాంకేతికత యొక్క నిరంతరాయ ఏకీకరణను సాధించాలని యోచిస్తోంది.
సుపరిపాలన – పౌరుల రక్షణ మరియు భద్రతను కట్టుదిట్టం చేయడం
- మా ఎన్డిఏ ప్రభుత్వం, నేరాలపట్ల ఏమాత్రం ఉపేక్షలేని ధృడమైన నిబద్ధతతో మంచిపాలనకు కట్టుబడి ఉంది. మొత్తం మీద మానవ సంక్షేమం, సామాన్యుల భద్రత మా ముఖ్య ప్రాధాన్యతగా ఉంటుంది.
- నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు ప్రజా భద్రతా చర్యలను బలోపేతం చేస్తోంది. ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ మరియు రియల్ టైం గవర్నెన్స్ను మెరుగుపరచడానికి, లక్షలాది ప్రైవేట్ సిసిటివి కెమెరాలను అనుసంధానించడంతో పాటు సుమారుగా 20,000 సిసిటివి కెమెరాలతో ఒక రాష్ట్ర వ్యాప్త క్లౌడ్ – ఆధారిత ఐపి సిసిటివి నిఘా వ్యవస్థను మోహరించడమైనది. సైబర్ నేరాలను నేర్పుగా ఎదుర్కోవడానికి, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడమవుతున్నది.
- ఆంధ్రప్రదేశ్లో గంజాయి మరియు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈఎజిఎల్ఇ), విద్యాసంస్థలు మరియు యువతపై దృష్టిని సారిస్తోంది. మా ప్రభుత్వం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి అక్రమ రవాణా మరియు మహిళలపై నేరాలు వంటి సంఘ విద్రోహ శక్తులను ముందస్తుగా నియంత్రించడం మరియు అటువంటి దుర్మార్గపు చర్యలను నిర్మూలించడానికి తగిన పద్దతులను తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరిస్తోంది. నేరాలను ఏమాత్రం సహించకుండా, సురక్షితమైను సమాజాన్ని నిర్వహించడానికి, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, శాంతి భద్రతలను కఠినంగా అమలు చేయడమవుతుంది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత మరియు అందరికీ న్యాయం మరియు భద్రతనిస్తూ, మహిళలపై జరిగే ఏ నేరాన్నైనా కఠినంగా అణచివేయడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర అనుసంధానంతో, విజిబుల్ పోలీసింగ్ – ఇన్ విజిబుల్ పోలీసు ద్వారా సమర్థవంతంగా శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.
- నా ప్రభుత్వం, అపారదర్శక, మోసపూరిత, పూర్తి నియంత్రిత వాల్యూ చైన్ విధానం నుండి సమర్ధవంతమైన పారదర్శకమైన మరియు మార్కెట్ ఆధారిత విధానంతో క్రొత్త ఎక్సైజ్ (అబ్కారీ) పాలసీ విధానాన్ని అమలు చేసింది. మేము నాణ్యమైన బ్రాండ్లను తిరిగి ప్రవేశవెట్టాం, వినియోగదారుల రక్షణను నిర్ధారించాం మరియు సరఫరా అనుసంధానతలో డిజిటల్ పరివర్తనలను అమలు చేసాం. అక్రమ రవాణాను నిరోధించడానికి మరియు వినియోగదారులకు పోల్చుకోదగిన ధరకు సదుపాయాన్ని అందించడానికి పొరుగు రాష్ట్రాలతో సమానంగా లేదా తక్కువగా ఉండేలా చేయడానికి ప్రధాన ఐఎంఎఫ్ఎల్ మరియు బీర్ బ్రాండ్ ధరలు తగ్గించడం జరిగింది.
- గత అసమర్ధతలు మరియు దుర్వినియోగాల నుండి పారదర్శకత, స్థిరత్వం మరియు జవాబుదారీతనం ఆధారిత చట్రానికి మారుతూ, మైనింగ్ విధానాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తున్నాము. మా క్రొత్త విధానం, వనరుల కేటాయింపు, పర్యావరణ బాధ్యత మరియు భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూర్చే ఆర్ధిక వృద్దిని నిర్దారిస్తుంది.
- గత ప్రభుత్వం, రెవెన్యూ పరిపాలనకు గణనీయమైన అంతరాయాన్ని కలిగించింది. మా ప్రభుత్వం భూ దురాక్రమణదారునిపై రుజువు భారాన్ని పెడుతూ భూ దురాక్రమణ నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు పారదర్శకతను నిర్ధారించడానికి మరియు యాజమాన్య హక్కులను రక్షించడానికి దుర్వినియోగాన్ని నిరోధించడానికి కట్టుదిట్టమైన భూ రికార్డులను తయారు చేయాలని మేము యోచిస్తున్నాం. పాలనను నేరుగా ప్రజల ముంగిటకు చేర్చిన ‘రెవెన్యూ సదస్సులు’ అనే నా ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన పరిపాలనా సంస్కరణ కార్యక్రమాన్ని నివేదించడం నాకు గర్వంగా ఉంది. 2024, డిసెంబర్ 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు మా బృందాలు 17,040 గ్రామాలకు చేరుకుని, ప్రజా పరిపాలన, పారదర్శక పాలనలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి. ఈ సంస్కరణ విజయం సుపరిపాలన మరియు ప్రజాసేవ పట్ల మా ప్రభుత్వానికి గల అచంచల నిబద్ధతకు నిదర్శనం.
ముగింపు
- స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ పయనం సమృద్ధి, సమ్మిళితత్వం, సుస్థిరత పట్ల అచంచలమైన నిబద్ధతకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ దార్శనికత అంకెలు, ఆర్థిక సూచికలకు అతీతంగా ఉంటుంది. ఇది ప్రజలను శక్తివంతం చేయడం, వర్గాలను బలోపేతం చేయడం మరియు రాష్ట్రం యొక్క ప్రతి మూలకు పురోగతి చేరేలా చూస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ చొరవ మాత్రమే కాదు, ఆధునిక, స్వావలంబన, అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి భాగస్వామి సహకరించాలని పిలుపునిచ్చే ఉద్యమం. పొలాల్లో సమృద్ధిని పెంపొందించే రైతులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పారిశ్రామికవేత్తలు, కొత్త శక్తిని తీసుకువచ్చే యువత మరియు సమ్మిళితత్వాన్ని నిర్ధారించే సామాజిక నాయకులు ఇందులో ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తారమైన సముద్రతీరం, పుష్కలమైన సహజ వనరులు మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్ తయారీ మరియు అధిక విలువ ఎగుమతులు వంటి రంగాలలో వృద్ధికి ప్రత్యేకంగా నిలుస్తాయి. రాష్ట్రం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సంపన్న సమాజానికి పునాది, భారతదేశ భవిష్యత్తు పరిశ్రమలను రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించాలి.
- వృద్ధి సుస్థిరంగా, సమ్మిళితంగా ఉండేలా చూడటం కూడా అంతే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దాని పర్యావరణాన్ని పణంగా పెట్టి లేదా సామాజిక అసమానతలు పెరిగే ప్రమాదంతో ముందుకువెళ్లదు. జల్ జీవన్ మిషన్, గతి శక్తి, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయి సాధికారత కార్యక్రమాలతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక దృక్పథంతో విధానాలను రూపొందించాలి. పట్టణ విస్తరణతోపాటు ఏ సామాజికవర్గం కూడా వెనుకబడకుండా గ్రామీణాభివృద్ధి జరగాలి. వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాల్గొనడానికి అవసరమైన సాధనాలతో యువతను సన్నద్ధం చేస్తూ విద్య, నైపుణ్యం మరియు డిజిటల్ ప్రాప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి వ్యక్తి సాధికారతను పొంది మరియు అందరినీ కలుపుకున్నట్లు భావించినప్పుడు మాత్రమే పురోగతి సాధించామని మనం నిజంగా చెప్పగలం.
“లేవండి, మేల్కొనండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు” అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను నేను ఇప్పుడు ఉదహరిస్తున్నాను.
- చివరగా, ఆంధ్రప్రదేశ్ యొక్క బలం దాని విధానాలు మరియు ప్రాజెక్టులలో మాత్రమే కాదు, దాని ప్రజల మమైకత, దృఢసంకల్పం మరియు ఆవిష్కరణ స్ఫూర్తిలో ఉందని గుర్తుంచుకుందాం. ముందున్న మార్గం అవకాశాలతో నిండి ఉంది మరియు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది మనదైన తరుణం. వ్యవహరించాల్సిన సమయమూ ఇప్పుడే. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసి నిర్మించుకుందాం, కలిసి ఎదుగుదాం, ఆంధ్రప్రదేశ్ను భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా చేద్దాం.
జై హింద్!
జై ఆంధ్ర!
జై జై స్వర్ణాంధ్ర!