75 ఏళ్ళ మహాప్రస్థానం : ప్రచురణ – ప్రభావం
——————————————————
తెలుగు జాతిపై భాషా సాహిత్యాలపై చెరగని ముద్రవేసిన మహాప్రస్థానం కావ్యం ప్రచురణకూ ఇది 75వ వార్షికోత్సవ సందర్భం.
మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి సంవత్సరం కూడా. అప్పటికే పెద్దవాళ్ల అభినందనలు పొందుతూ, యువసాహిత్య కారుల జేబుల్లో కత్తిరించుకున్న కాగితాల్లోంచి వినిపిస్తున్న మహాప్రస్థాన గీతాలు పదేళ్ల వూహల, ఆలస్యాల తర్వాత 1950లో పుస్తకరూపం తీసుకున్నాయి.
‘చూడు చూడు నీడలు పేదవాళ్ల వాడలు” అన్నా, ”ఇంతేలే పేదల గుండెలు” అన్నా శ్రీశ్రీ కవితలను సానుభూతి కవితగా భావిస్తారు తప్ప స్వానుభవ కవితలనుకోరు. నిజానికి అది అచ్చమైన ఆయన జీవితానుభవం. ప్రపంచాన్ని శాసించగలిగిన కవితా స్రష్ట అయివుండి కూడా కోరి ప్రజా కవిత్వ మార్గాన్ని చేపట్టిన శ్రీశ్రీ తదుపరి జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చాలా మందికి తెలుసు. కాని అంతకుముందు కూడా ఆయన జీవితంలో వెలుగు నీడలున్నాయి. 30వ దశకం ఆకలి దశకం అని, ఆ కాలంలోనే తన మహాప్రస్థాన గీతాలు వెలువడ్డాయని ఆయన చాలాసార్లు చెప్పారు. ”.. 1930 నుంచి 1940 దాకా నేను చాలా అవస్థలు పడ్డాను. ఆ దశాబ్దంలోనే నా మహాప్రస్థానం గీతాలన్నీ (చాలామట్టుకు) రాశాను. అదో భయంకరమైన దశాబ్దం. దాన్ని హంగ్రీ థర్టీస్ అన్నారు చరిత్రకారులు.”
ఈ ఆర్థిక సంక్షోభం రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసింది. పరాయి పాలనలోని ఈ దేశం ఆ దుష్ప్రభావాన్ని మరింతగా మోయవలసి వచ్చింది. సామాన్యుల జీవితాలు సంక్షుభితమయ్యాయి. శ్రీశ్రీ తండ్రి రమణయ్య మాష్టారు వ్యసనాలు, ఇతర కారణాలతో ఆస్తిని పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. శ్రీశ్రీ మద్రాసులో చదువు పూర్తి చేసే నాటికే కుటుంబ పరిస్థితి దిగజారుతున్నది. ఈ కారణం గానే తనకు లక్నో వెళ్లి ఎంఎ చదవాలని వున్నా మానుకున్నాడు. అప్పుడే ప్రాణాంతకమైన టైఫాయిడ్ బారిన పడ్డాడు. ”భయంకరమైన జ్వరంతో వచ్చేప్రాణం పోయే ప్రాణంగా ఉంటుండగా మా ఇల్లు వేలం పాటలో అమ్మకమై పోయింది. అవి నా దరిద్రపు రోజులు. రెండేసి రోజులు తిండి లేకుండా బతికాను. ఆ పది సంవత్సరాల్లోనే మహాప్రస్థాన గీతాలు రాశాను..” అని శ్రీశ్రీ ఆ రోజుల గురించి రాసుకున్నారు.
సంఘర్షణాత్మకమైన నాటి దేశ కాల పరిస్థితులు కూడా ప్రజాకవి ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాయి. గురజాడ, కందుకూరి గతించేనాటికి తెలుగుదేశంలో పరిశ్రమలు అపుడపుడే తలెత్తుతున్నాయి. శ్రీశ్రీ కాలం నాటికి అవి బాగా ఊపందుకున్నాయి. ఆ యంత్ర యుగమే, పారిశ్రామిక వాతావరణమే తెలుగులో శ్రామికవర్గ మహాకవికి జన్మనిచ్చింది.
విశాఖపట్టణంలో హార్బరు నిర్మాణం చురుకుగా సాగిపోతోంది. దూరంగా కొంద మీద నిలబడి, టెలిగ్రాఫు తీగలను చూస్తూవుంటే, ఆ సమానాంతర రేఖల్లో ఆయనకో అద్వితీయ అనుభూతి కలిగింది. ఇది దేవుడు గారు సృష్టించిన ప్రకృతి గాదు. ప్రకృతిని తన అదుపులోకి తీసుకురావడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నం అని తెలుసుకున్నాడు. ఆ తీగల్లో ప్రసరించే విద్యుచ్ఛక్తి తన నూతన కవిత్వానికి ఆవేశం ఇచ్చింది. దీనికి నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. ‘మహాప్రస్థానం’ గీతాలు రాస్తున్న దశాబ్దం (1930-40)లో స్పెయిన్లో ప్రచండమైన అంతర్యుద్ధం సాగింది. 1920 సత్యాగ్రహోద్యమం ప్రారంభమైన కాలానికే రష్యాలో విప్లవం విజయవంతమైంది. దాని ప్రభావ ఛాయలు ఉన్నవ వారి ‘మాలపల్లి’లో ప్రస్ఫుటమయ్యాయి.
1920 దశకం నాటికి సాహిత్యరంగంలో భాషలో, భావంలో, సాహితీ సంస్థల నిర్మాణంలో మార్పులు వచ్చాయి. భాషా పాండిత్యాలకే పరిమితమైన సాహితీసంస్థలు పోయి, సాహితీసమితి, నవ్యసాహిత్య పరిషత్తు లాంటివి తలెత్తాయి. విదేశీ పాలన నుంచి స్వేచ్ఛనే గాక ఫ్యూడల్ సమాజ బంధనాల నుంచి విశృంఖల భావ స్వాతంత్య్రాన్ని కోరుతూ వచ్చారు కృష్ణశాస్త్రి తరం భావకవులు. మహిళా హైన్యస్థితి విధ్వంసనకై స్వేచ్ఛను బోధించారు చలం లాంటి వాళ్లు. కర్షకుల, పాటక జనుల జీవిత పరిస్థితులను దువ్వూరి రామిరెడ్డి, కవి కొండల వెంకటరావు మొదలైనవారు తమ కవితల ద్వారా చిత్రించారు. రెండు సత్యాగ్రహ ఉద్యమాలు ముగిసి, కాంక్షించిన స్వరాజ్యం రాకపోగా జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు తెలుగు కవుల్లో గొప్ప జాగృతిని కల్గించాయి. జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రపంచ సంస్కృతి పరిరక్షణ ఒక ప్రధాన కర్తవ్యంగా ప్రపంచమందలి వివిధ దేశాల మేధావుల కర్తవ్యమైంది.
తుమ్మల సీతారామమూర్తి, విద్యాన్ విశ్వం మొదలైనవారు రైతు సమస్యలపై రాసిన పాటలను కవితలను ‘రైౖతు భజనావళి’ ప్రచురించారు. 1934లోనే సోషలిస్టు పార్టీ ప్రత్యక్షంగానూ, కమ్యూనిస్టు పార్టీ ప్రచ్ఛన్నంగాను పనిచేయడం ప్రారంభించిన రోజుల్లోనే తుమ్మల రాసిన ‘ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా’ అనే పాట, ‘ఆకలి మంటల మలమలమాడే అనాథలందరు లేవండోరు’ అనే అంతర్జాతీయ గీత అనువాదం, ‘అన్నా కూలీ లేకము కావలెరా’ అనే కార్మిక ఐక్యతా ప్రబోధగేయం, గోర్కీ ‘అమ్మ’ మొదలైన రచనలు తెలుగునాట అభ్యుదయ రచనోద్యమానికి అంకురార్పణ చేశాయి. వ్యావహారిక భాషా ఉద్యమం విజయ పతాకను ఎగురవేస్తున్నది. సంస్కరణోద్యమాల ప్రభావమూ, హేతువాద దృష్టీ, సమకాలీన సమాజ దుస్థితి పరిశీలనా ప్రారంభ మయ్యాయి. ఈ స్వాతంత్య్ర చైతన్యం తదుపరి దశ సామ్యవాద చైతన్యం. శ్రీశ్రీ దానికి ప్రతినిధి. తన దృష్టి ఆర్థిక స్వాతంత్య్రం, సమానత్వం కోసం సాగే పోరాటంపై కేంద్రీకృతమైంది. అందుకోసం ఆయన మోగించిన కవిత జయభేరి.
‘జయభేరి’తో మొదలైన కవితా ప్రస్థానం మహా ప్రస్థానం గీతంతో తారాస్థాయికి చేరింది. ఈ రెంటికీ మధ్యన ఒక రాత్రి, గంటలు, ఆకాశదీపం కవితలు వస్తాయి. తెలుగు జాతి జీవనాదాల్లో ఒకటిగా మిగిలిపోయిన మహత్తర గీతం మహాప్రస్థానం రాయడానికి అయిదు నిముషాలు కూడా పట్టలేదంటే ఆ భావం అంతరాంతరాల్లో ఆయన ఎంతగా నిబిడీకృతమై పోయిందో తెలుస్తుంది. ఈ మహత్తర గీత రచనపై ఆయనే చాలా హృద్యంగా చెప్పాడు. ‘మరో ప్రపంచం/ మరో ప్రపంచం’ గీతాన్ని 1934 ఏప్రిల్ 12వ తేదీన రాశారు. పెన్ను దొరక్కపోతే పెన్సిలుతోనే రాశాడు. మరో ప్రపంచం అని ప్రారంభించి భుగభుగలు అని ముగించేదాకా పెన్సిల్ ఆపలేదు.
”మహాప్రస్థానం’ గీత సంపుటిలోని చాలా రచనలు ఒక్కమాటు ఒక్కచోట ఒక్కపూటలో రాసినవే.
నాలుగైదు గీతాలు మాత్రం మొదట ప్రారంభించి తర్వాత కొన్నాళ్ళకు పూర్తి చేసినవి. ‘దేశచరిత్రలు’ వరుసగా రెండురోజులు కూర్చుని రాశాను. ప్రారంభించిన తేదీకాక పూర్తిచేసిన తేదీనే విషయానుక్రమణికలో ఇచ్చాను. మొదట కొంతవరకు రాసి, తర్వాత చాలాకానికి పూర్తి చేసిన గీతాలలో ముఖ్యమైనది ‘జగన్నాథుని రథచక్రాలు’. ఇది ఎప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోతుందేమో అని ఒక్కొక్కప్పుడు నాకే సందేహం కలిగేది. మహాప్రస్థానం సంపుటిలో మొట్టమొదటి గీతం మహాప్రస్థానం, చిట్టచివరి గీతం జగన్నాథుని రథచక్రాలు ఉండాలని నా
ఉద్దేశం. 1940లో ఒకరోజు రథచక్రాలు రాయడం పూర్తి అయింది. కాని తర్వాత పదేళ్ళ వరకు గాని గ్రంథం అచ్చు కాలేదు. అందుచేత 40 తర్వాత వ్రాసిన నీడలు, నిజంగానే, గర్జించు రష్యా అనే గేయాలు కూడా ఈ సంపుటిలో చేర్చాను.’ అని శ్రీశ్రీ వివిధ చోట్ల చెప్పారు.
మహా ప్రస్థానం రాసే నాటికి తనకు మార్క్సిజం తెలియదని శ్రీశ్రీ అన్న మాటకు విపరీతార్థాలు తీసేవారు కొందరున్నారు. ఆయనే ఇలా స్పష్టం చేశాడు : ”గురజాడ అప్పారావు గారు మార్క్సిజం చదువుకోలేదు. కాని ఆయన ‘కన్యాశుల్కం’లో కనబడే సామాజిక పరిశీలన చాలా గొప్పది. మార్క్సిజం చదివినవాడికే అది సాధ్యమవుతుంది. గురజాడ శిక్షణ ద్వారా, అధ్యయనం ద్వారా మార్క్సిస్టు కాకపోవచ్చు. కాని ఆయనలో అలాంటి భావాలు వ్యక్తమయినాయి. అలాగే నేను ‘మహాప్రస్థానం’ రాసేనాటికి మార్క్సిజం చదవలేదు. అయితే మయకోవస్కీ లాంటి మార్కిస్టు రచయితల రచనలు, కవిత్వం చదివాను. వారి ప్రభావం నామీద వుంది. అలాగే చాలామంది యువ రచయితల మీద అప్పుడు వీస్తున్న గాలి ప్రభావం వుంది. మార్క్సిజం ప్రేరణ వుంది.”
తన గీతాల సంపుటి కొంపెల్ల జనార్దనరావుకు అంకితం చేస్తూ శ్రీశ్రీ 1937లోనే స్మృతి గీతం రాసి పెట్టుకున్నాడు.
కనీసం 1940లోనే వాటిని పుస్తకంగా తీసుకురావాలను కున్నాడు. అప్పట్లో ఆయనకు ‘అనధికార ప్రచారాధికారి’గా వున్న జరుక్ శాస్త్రి సూచనపై అందుకు చలంతో ముందుమాట రాయించి పెట్టుకున్నాడు. కింద చలం సంతకం దగ్గర 17.7.1940, బెజవాడ అని వుంటుంది. అయితే అది అచ్చులో రావడానికి మరో పదేళ్లు ఆగవలసి వచ్చింది. నళినీ కుమార్ అనే సహృదయ సాహితీమిత్రుడు సహాయం చేయడంతో ‘మహాప్రస్థానం’ 1950లో వెలుగు చూసింది.
‘మహాప్రస్థానం’ పునర్ముద్రణలు విశాలాంధ్ర నిరాఘాటంగా కొనసాగిస్తోంది. ముఖచిత్రంగా మా.గోఖలే వేసిన చిత్రం కొన్ని వేల మెదళ్లలో ముద్రితమై పోయింది.
బహుశా తెలుగులో అత్యధికంగా అమ్ముడుపోయిన సృజనాత్మక కవిత్వం అదేనంటే అందరూ అంగీకరిస్తారు. 1981లో శ్రీశ్రీ దంపతుల లండన్ పర్యటన సందర్భంగా గూటాల కృష్ణమూర్తి ఆ కావ్యాన్ని శ్రీశ్రీ స్వదస్తూరితో అద్భుతంగా తీసుకొచ్చారు. ఆయన గానం చేసిన క్యాసెట్ను కూడా జతపర్చారు. 2021లో విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు మహాకవి కోరిన సైజులో కాకున్నా భారీ సైజులోనే మహాప్రస్థానం ప్రత్యేకంగా ప్రచురించి అభినందనలు పొందారు. విరసం వారు సంపుటాలుగా ప్రచురించారు. మనస్విని ట్రస్టు ప్రస్థాన త్రయం తీసుకొచ్చింది. 2010లో శ్రీశ్రీ శతజయంతి సందర్భంలో నేను రాసిన ‘శ్రీశ్రీ జయభేరి’ జీవితం- సాహిత్యం – రాజకీయాలు కూడా ఆరు ముద్రణలపైగా వచ్చిందంటే ఆ ప్రభావం ఎంత బలమైందో తెలుస్తోంది. ఎవరో అన్నట్టు- శ్రీశ్రీ కన్నా ఆయన కవిత్వం గొప్పది, కవిత్వం కన్నా ఆయన కవితా మార్గం మరింత గొప్పది. పదండి ముందుకు అని నడిపిస్తూనే వుంటుంది.
- తెలకపల్లి రవి