వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా
-ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
ఎగ్జామ్స్ నిర్వహణలో పెరగనున్న మరింత పారదర్శకత
-37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల సీసీ కెమెరాలతో ఇక్కడికి అనుసంధానం
-విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం
-కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు
-వర్సిటీ ద్వారా జరిగే అన్ని రకాల పరీక్ష ల పరిశీలన
-మంత్రి శ్రీ సత్యకుమార్ వెల్లడి
వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్’ను ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక/సప్లిమెంటరీ పరీక్షల తీరును సీసీ కెమెరాల ద్వారా విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తుంటారని తెలిపారు దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని తెలిపారు. గతానుభవాల దృష్ట్యా వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగే గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని రిమోట్ కమాండ్ కంట్రోలు రూముకు అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమును మంత్రి శ్రీ సత్యకుమార్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ అన్ని కోర్సుల్లో కలిపి వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల కింద ఏడాదికి సుమారు 60వేల మంది పరీక్షలు రాస్తుంటారని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ పరీక్షల నుంచి దశల వారీగా డెంటల్ ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ ఇతర కోర్సుల్లో చదివే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను సైతం రిమోట్ కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. ప్రస్తుతానికి 5 వైద్య కళాశాలల్లో ప్రస్తుతం జరిగే పరీక్షల తీరును గమనించడం ప్రారంభించినట్లు తెలిపారు. కాలేజీల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. ఈ రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రస్తుతం ఉన్న విధానానికి అదనంగా ఉంటుందన్నారు.
ఈ సెంటర్ ఏర్పాటుతో పరీక్షల నిర్వహణలో పాల్గొనే వారు మరిoత అప్రమత్తం అవుతారని తెలిపారు. మానవ వనరులు వృధా కాకుండా ఉంటాయని చెప్పారు.
70రోజుల వరకు నిక్షిప్తం!
కళాశాలలోని గదుల్లో పరీక్షలు రాసే విద్యార్థుల కదలికలు కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లలో నిక్షిప్తమవుతాయి ఇక్కడ జరిగే రికార్డింగ్ (దృశ్యాలు) 70 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది రికార్డింగ్లోని దృశ్యాలు చెడిపోని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కళాశాలల్లోని గదుల సామర్ధ్యాన్ని అనుసరించి సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఉంటాయి. కమాండ్ కంట్రోల్ రూములో మొత్తం ఆరు స్క్రీన్ల వీడియో వాల్ తోపాటు పది కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని ఉద్యోగులు నిశితంగా పరిశీలన చేస్తుంటారు. కళాశాలల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నా… వెంటనే కమాండ్ కంట్రోల్ రూములోనికి వారికి ఏఐ ద్వారా తెలిసేలా చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులకు ర్యాండమ్ విధానంలో విధులను కేటాయిస్తారు. ఒకవేళ కళాశాలలో ఇంటర్నెటు కనెక్షన్ పనిచేయని సమయంలో జరిగిన దృశ్యాలు సైతం కనిపించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రస్తుత విధానంలో మాదిరిగా కళాశాలల యాజమాన్యాలు సీసీ కెమెరాల వినియోగ హార్డ్ డిస్కును విశ్వవిద్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉండదు.
అన్ని పరీక్షలను రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించేలా చర్యలు!
ఓరిగో బిజ్ సొల్యూషన్స్ సిస్టమ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కార్యకలాపాలు కొనసాగుతాయి. దూరాంక్ సంస్థ వారు సాఫ్ట్వేర్ అందించారు. “కేంద్రం ఏర్పాటుకు రూ.30 లక్షల వరకు ఖర్చు అయింది. రెండేళ్ల నిర్వహణ కింద రూ.1.5కోట్ల వరకు ఖర్చు అవుతుంది విశ్వవిద్యాలయం ద్వారా జరిగే ఇతర పరీక్షలను కూడా రిమోటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటాం’ అని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి వివరించారు.
విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ శ్రీకాంత్ ఏపీ వైద్య మండలి చైర్మన్ శ్రీహరిరావు పాల్గొన్నారు.



























































