ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026
ఏడు ఏఐ ఇంపాక్ట్ థీమ్లలో ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం
ముఖ్య అంశాలు
- ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది ‘గ్లోబల్ సౌత్‘ (వర్ధమాన దేశాలు) నిర్వహిస్తున్న మొట్టమొదటి గ్లోబల్ ఏఐ సదస్సు.
- బాధ్యతాయుతమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏఐ ని రూపొందించడంలో భాగంగా 100 కంటే ఎక్కువ దేశాలు ‘ఏడు చక్రాలు‘ లేదా వర్కింగ్ గ్రూపుల ద్వారా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి.
- ఈ సదస్సు పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (గ్రహం), ప్రోగ్రెస్ (ప్రగతి) అనే మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇవే ఏఐ పై అంతర్జాతీయ సహకారానికి ప్రధాన సూత్రాలు.
పరిచయం
భారతదేశం తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలకమైన దశలో ఉంది, ఇక్కడ కృత్రిమ మేధ ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. భారత్ కి, ఏఐ అనేది సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడానికి, అందరికీ అందుబాటులో, కలుపుకుపోవడం, సమానత్వాన్ని అందించడానికి ఒక వ్యూహాత్మక జాతీయ సాధనంగా పనిచేస్తుంది. ఈ సాంకేతిక విప్లవం మానవ ప్రయత్నాల్లోని ప్రతి రంగంలోనూ గొప్ప పురోగతికి అపారమైన అవకాశాలను తెరిచింది. అంతర్జాతీయ సాంకేతికత, పాలనా వేదికలపై భారత్ పాత్ర నిరంతరం విస్తరిస్తోంది, ఇది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అంతర్జాతీయ విధాన చర్చల్లో పెరుగుతున్న దేశ పరపతిని ప్రతిబింబిస్తుంది.
ఈ పెరుగుతున్న అంతర్జాతీయ భాగస్వామ్యంలో భాగంగా ఇండియా-AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూదిల్లీలో ఫిబ్రవరి 16-20 తేదీల్లో జరగనుంది. ఇది గ్లోబల్ సౌత్లో నిర్వహించనున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు.
ఈ సదస్సు కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఆర్థిక వ్యవస్థల్లో మెరుగైన ఫలితాలను సాధించే ప్రభావవంతమైన ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది ‘అందరి సంక్షేమం, అందరి సంతోషం’ అనే జాతీయ దార్శనికతకు, ‘మానవాళి కోసం ఏఐ ‘ అనే ప్రపంచ సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. పాలన, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిలో ఏఐ ఉపయోగాలు, భవిష్యత్తు మార్గాలను రూపొందించడానికి ఇది ప్రపంచ నాయకులు, విధానకర్తలు, ఆవిష్కర్తలు, నిపుణులను ఒకచోట చేరుస్తుంది.
ఇండియా– ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా రూపొందించబడింది. ఇవి ఏఐ పై ప్రపంచ సహకారానికి అవసరమైన ప్రధాన సూత్రాలను వివరిస్తాయి:
- ప్రజలు (People): మానవ హక్కులను కాపాడే, సేవల లభ్యతను మెరుగుపరిచే, నమ్మకాన్ని పెంపొందించే, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ప్రయోజనాలను అందించే ‘మానవ-కేంద్రిత ఏఐ’ని ప్రోత్సహించడం.
- భూమి (Planet): శక్తిని ఆదా చేసే వ్యవస్థలను, బాధ్యతాయుతమైన వనరుల వినియోగాన్ని, వాతావరణ మార్పులను తట్టుకునేలా తోడ్పడే అప్లికేషన్లను ప్రోత్సహిస్తూ.. పర్యావరణానికి మేలు చేసే ‘సుస్థిర ఏఐ’ని అభివృద్ధి చేయడం.
- ప్రగతి (Progress): ఆవిష్కరణలు, సామర్థ్య పెంపుదల, ఉత్పాదకతను పెంచేలా ఏఐ ని ఉపయోగించడం ద్వారా.. అందరికీ ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి ఫలాలు అందేలా చూడటం.
ప్రధాన ఇతివృత్తాలు: ఇండియా– ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించిన ఏడు చక్రాలు
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 విశేషమైన ఉన్నత స్థాయి భాగస్వామ్యాన్ని ఆకర్షించింది. ఇందులో 15-20 మంది ప్రభుత్వ అధినేతలు, 50 మందికి పైగా అంతర్జాతీయ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ, భారతీయ సీఈఓ లు పాల్గొంటారని అంచనా.
ఈ సదస్సులోని చర్చలు ఏడు పరస్పర అనుసంధానిత ఇతివృత్తాల చుట్టూ రూపొందించిన ‘చక్రాలు’ లేదా ‘వర్కింగ్ గ్రూపుల’ ద్వారా నిర్వహిస్తారు. ప్రతి చక్రం ఏఐ ప్రభావం చూపే ఒక ప్రధాన రంగంపై దృష్టి పెడుతుంది, పైన పేర్కొన్న ‘సూత్రాలను’ విధానపరమైన, వాస్తవ వినియోగ రంగాలలో ఆచరణాత్మక చర్యలుగా మారుస్తుంది. బాధ్యతాయుతమైన, సమగ్రమైన ఏఐ భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు ఈ వర్కింగ్ గ్రూపుల ద్వారా భాగస్వాములయ్యాయి.
నైపుణ్యాలను పెంపొందించడం నుంచి నైతిక వినియోగాన్ని నిర్ధారించడం వరకు.. సమాజంపై ఏఐ చూపే ప్రభావాలపై ప్రతి చక్రం బహుళ పక్ష సహకారాన్ని ప్రోత్సహిస్తుంది
| చక్రం | దృష్టి సారించే అంశాలు |
| మానవ మూలధనం | ఏఐ యుగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణను అందిస్తూ, శ్రామిక శక్తిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం |
| సామాజిక సాధికారత కోసం చేరిక | విభిన్న వర్గాలకు సాధికారతనిచ్చేలా, సమాన ప్రాతినిధ్యం ఉండేలా ఏఐ ని రూపొందించడం. |
| సురక్షిత, నమ్మకమైన ఏఐ | పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనంతో అంతర్జాతీయంగా విశ్వసనీయమైన ఏఐ వ్యవస్థలను నిర్మించడం. |
| సైన్స్ / శాస్త్ర విజ్ఞానం | విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, వాటిని ప్రపంచ ప్రగతికి చోదక శక్తిగా మార్చడానికి ఏఐ ని ఉపయోగించడం. |
| స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సామర్థ్యం | వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేసే, వనరులను ఆదా చేసే ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడం. |
| ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ | ఏఐ అభివృద్ధికి అవసరమైన కంప్యూట్, డేటా వంటి ప్రాథమిక వనరులను అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడం. |
| ఆర్థిక అభివృద్ధి, సామాజిక మేలు కోసం ఏఐ | ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక వ్యవస్థలలో కలుపుకొనిపోయే వృద్ధిని సాధించడానికి ఏఐ ని ఒక సాధనంగా వాడటం. |
ఈ చక్రాల ద్వారా, భారతదేశం స్థానిక సవాళ్లను పరిష్కరిస్తూనే, అంతర్జాతీయంగా ఏఐ ప్రమాణాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సు ద్వారా వచ్చే ఫలితాలు రాబోయే సంవత్సరాల్లో విధానకర్తలకు, పెట్టుబడిదారులకు, పరిశ్రమల నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
మానవ వనరులు: ప్రపంచ ఏఐ సహకారానికి పునాదిగా నిలుస్తున్న దేశ ప్రతిభా సంపద
భారత్ వేగంగా ఏఐ ని అందిపుచ్చుకోవడం వల్ల వివిధ రంగాలలో ఆవిష్కరణలకు, సమగ్ర వృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అన్ని ప్రాంతాలు, సామాజిక-ఆర్థిక వర్గాల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తూనే.. ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం భారత్ తన శ్రామిక శక్తిని సిద్ధం చేస్తోంది. ‘హ్యూమన్ క్యాపిటల్’ (మానవ వనరులు) అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్ ఈ ప్రయత్నాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇది శ్రామిక శక్తిని కొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడానికి, అభివృద్ధి చెందుతున్న కొత్త ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను పౌరులకు అందించే ఒక సమానమైన ఏఐ నైపుణ్య వ్యవస్థను రూపొందిస్తుంది.
భారతదేశ ప్రతిభా శక్తికి సంబంధించిన కీలక జాతీయ సూచికలు
- ఏఐ నైపుణ్యాలు, ప్రతిభ వృద్ధి: ఏఐ నైపుణ్యాల వ్యాప్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్ర దేశాలలో ఒకటిగా ఉంది. 2016 నుంచి ఇప్పటివరకు ఏఐ నైపుణ్యం కలిగిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
- ఏఐ సామర్థ్యంలో ప్రపంచ నాయకత్వం: స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్రకారం, సుమారు 33% వార్షిక నియామక వృద్ధితో ఏఐ టాలెంట్ అక్విజిషన్లో భారత్ ప్రపంచంలోనే ముందుంది. అలాగే, ‘గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’లో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.
- ఏఐ శ్రామిక శక్తి సాధికారత: ‘ఇండియా- ఏఐ ఫ్యూచర్స్కిల్స్’ కింద ప్రభుత్వం ఏఐ పరిశోధన, శిక్షణలో 500 మంది పి.హెచ్.డి స్కాలర్లు, 5,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లకు సహకరిస్తోంది.
- ప్రపంచ స్థాయి గుర్తింపు: కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియా- ఏఐ మిషన్’, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ అయిన పారిస్లోని ‘స్టేషన్ ఎఫ్’, ప్రముఖ బిజినెస్ స్కూల్ ‘హెచ్ఈసి పారిస్’ భాగస్వామ్యంతో చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రామ్ కోసం 10 భారతీయ ఏఐ స్టార్టప్లను ఎంపిక చేసింది. ఇది భారతీయ ఏఐ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై నిలబెట్టింది.
- ఉపాధిపై ప్రభావం: ఏఐ సాంకేతికత భారతదేశ ఐటీ సేవల రంగాన్ని సమూలంగా మారుస్తూ, రాబోయే కొద్ది సంవత్సరాలలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది.
నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడులు మన దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, ప్రపంచ ఏఐ సహకారంలో భారతదేశాన్ని ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలబెడుతున్నాయి.
సామాజిక సాధికారత – అందరి భాగస్వామ్యం: సమగ్ర ఏఐ పట్ల భారతదేశ విధానం
వివిధ భాషలు, ప్రాంతాలు, విభిన్న సామర్థ్యాలు కలిగిన వర్గాలకు సేవలను, భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం ద్వారా సామాజిక సమ్మిళితాన్ని విస్తరించడానికి ఏఐ భారత్ కి ఒక శక్తివంతమైన మార్గాన్ని అందిస్తుంది. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపీఐ), ఏఐ ఆవిష్కరణలను స్పష్టమైన సామాజిక ఫలితాలుగా మార్చడానికి అనువైన స్థితిలో ఉంది. ‘సామాజిక సాధికారత కోసం సమ్మిళితం’ అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్, భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ‘ఇన్క్లూజివ్-బై-డిజైన్’ ఏఐ పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఇది సంస్థాగత సిద్ధతను బలోపేతం చేయడంతో పాటు, ఏఐ వ్యవస్థలు సురక్షితంగా, సందర్భోచితంగా, ఉపయోగకరంగా ఉండేలా చూస్తుంది; తద్వారా వెనుకబడిన, బలహీన వర్గాలకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది.
ఏఐ ద్వారా సామాజిక సాధికారతను పెంపొందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాలు
- గ్లోబల్ హెల్త్– ఏఐ భాగస్వామ్యం: ఆరోగ్య సంరక్షణలో ఏఐ ని సురక్షితంగా, నైతికంగా ఉపయోగించడం కోసం ‘హెల్త్- ఏఐ ‘ అనే గ్లోబల్ ప్లాట్ఫారమ్తో భారతదేశం భాగస్వామిగా ఉంది. ఇది బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను, ప్రపంచవ్యాప్త ఉత్తమ పద్ధతులను అనుసరించడాన్ని బలోపేతం చేస్తుంది.
- భాషిణి: భాషిణి ప్లాట్ఫారమ్ సమ్మిళిత ‘వాయిస్-ఫస్ట్’ డిజిటల్ పాలనను అందిస్తుంది. ఇది 36 కంటే ఎక్కువ టెక్స్ట్ భాషలు, 22 వాయిస్ భాషలు, 350కి పైగా ఏఐ భాషా నమూనాలకు సహకరిస్తూ, అన్ని ప్రాంతాల వారికి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తోంది.
- రైతులకు ఏఐ ఆధారిత సేవలు: ‘కిసాన్ ఇ-మిత్ర’ అనేది వాయిస్ ఆధారిత ఏఐ చాట్బాట్. దీని ద్వారా రైతులు 11 ప్రాంతీయ భాషల్లో ‘పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ సేవలను పొందవచ్చు. ఇది ప్రతిరోజూ 20,000 కంటే ఎక్కువ సందేహాలను పరిష్కరిస్తోంది. ఇప్పటివరకు 95 లక్షలకు పైగా ప్రశ్నలకు సమాధానమిచ్చి, ఏఐ ద్వారా సేవలందించడంలో కీలకంగా మారింది.
| భారత్–విస్తార్: ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవసాయ ప్లాట్ఫారమ్ |
| కేంద్ర బడ్జెట్ 2026-2027లో భారత్–విస్తార్ అనే బహుభాషా ఏఐ ప్లాట్ఫారమ్ను ప్రతిపాదించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టల్లను, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఎఆర్) వ్యవసాయ పద్ధతులను ఏఐ వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ డిజిటల్ వ్యవసాయ విస్తరణకు తోడ్పడటమే కాకుండా, ఆయా ప్రాంతాలకు తగిన సూచనలను అందిస్తుంది. ఇది శాస్త్రీయ, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో రైతులకు మరింత సహాయకారిగా మారుతుంది. |
అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనం కోసం ఏఐ: నీతి ఆయోగ్ విడుదల చేసిన ఏఐ ఫర్ ఇన్క్లూజివ్ సొసైటల్ డెవలప్మెంట్’ (అక్టోబర్ 2025) నివేదిక, వివిధ సేవలను పొందే అవకాశాలను విస్తృతం చేయడం ద్వారా భారతదేశంలోని 490 మిలియన్ల (49 కోట్లు) అసంఘటిత రంగ కార్మికులకు సాధికారత కల్పించడంలో ఏఐ సామర్థ్యాన్ని ప్రస్తావించింది.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)లో సమ్మిళిత డిజైన్ను అనుసంధానించడం ద్వారా, ఏఐ వ్యవస్థలు వివిధ భాషలు, ప్రాంతాలలో సేవలను మెరుగుపరుస్తున్నాయి. ఇది భారతదేశపు ఏఐ పాలనా ప్రయాణంలో నమ్మకాన్ని, సామాజిక సాధికారతను ప్రధాన ఫలితాలుగా అందిస్తోంది.
| సురక్షితమైన, నమ్మకమైన ఏఐ: జాతీయ ప్రాధాన్యతలకు తగ్గట్టు బాధ్యతాయుతమైన ఏఐ ని ప్రోత్సహించడం |
ఏఐ వ్యవస్థల పరిధి, ప్రభావం పెరుగుతున్న కొద్దీ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను కొనసాగించడానికి విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకంగా మారాయి. భారతదేశపు నియంత్రణ చట్రాలు ప్రపంచ స్థాయి ఏఐ భద్రతా ప్రయత్నాలకు అర్థవంతమైన సహకారాన్ని అందించేలా ఉన్నాయి. ‘సురక్షితమైన, నమ్మకమైన ఏఐ’ అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్, పాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది.
సురక్షితమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ ని అభివృద్ధి చేయడంలో భారతదేశ కృషి:
- బాధ్యతాయుతమైన ఏఐ ప్రాజెక్టుల పోర్ట్ఫోలియో: సురక్షితమైన, నమ్మకమైన ఏఐ అనే విభాగం కింద, 13 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. భద్రత, వివక్ష నివారణ, పారదర్శకత, జవాబుదారీతనంపై దృష్టి సారించే బాధ్యతాయుతమైన ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం వీటి లక్ష్యం.
- మిషన్ డిజిటల్ శ్రమసేతు: అసంఘటిత రంగ కార్మికులకు సాధికారత కల్పించడానికి ఏఐ, ఇతర వర్ధమాన సాంకేతికతలను ఉపయోగించుకుంటూ, ఏఐ ని అందరికీ అందుబాటులోకి, చౌకగా మార్చే లక్ష్యంతో నీతి ఆయోగ్ ‘మిషన్ డిజిటల్ శ్రమసేతు’ను ప్రతిపాదించింది.
- ఇండియా– ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్: ఏఐ వల్ల కలిగే నష్టాలను, భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి, ఇండియా- ఏఐ మిషన్ లోని ‘సురక్షితమైన, నమ్మకమైన’ విభాగం కింద భారత్ ‘ఇండియా- ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ను ఏర్పాటు చేస్తోంది.
AI పాలనా మార్గదర్శకాలు |
| ఇండియా- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముందు, భారత్ ఏఐ పాలనా మార్గదర్శకాలు, ఏఐ వినియోగాన్ని జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానిస్తున్నాయి. ఈ సూత్రాలను ఆచరణలో పెట్టడానికి, ఈ మార్గదర్శకాలు ఒక వ్యవస్థీకృత పాలనా చట్రాన్ని ప్రతిపాదిస్తున్నాయి:
● ఏఐ గవర్నెన్స్ గ్రూప్ (AIGG): మొత్తం విధాన రూపకల్పనను సమన్వయం చేయడానికి, ఏఐ పాలనను జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చేందుకు ఈ గ్రూపు ఏర్పాటు ● టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ (TPEC): జాతీయ, అంతర్జాతీయ ఏఐ పాలనాపరమైన అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలను అందివ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు
● ఇండియా– ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ (AISI) బలోపేతం: పరిశోధనలు చేయడం, ప్రమాణాలను రూపొందించడం, టెస్టింగ్ పద్ధతులు, బెంచ్మార్క్లను అభివృద్ధి చేయడం కోసం ఈ సంస్థకు తగిన వనరులను అందించడం. ఇది అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల సంస్థలతో సహకరిస్తూ, నియంత్రణ సంస్థలకు, పరిశ్రమలకు సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. |
భారతదేశం ఆవిష్కరణలతో పాటు బాధ్యతాయుతమైన ప్రయాణాన్ని సాగించే సమతుల్య ఏఐ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. ‘సురక్షితమైన, నమ్మకమైన ఏఐ చక్రం‘ (Safe and Trusted AI Chakra) అందరినీ కలుపుకుపోవడం, వృద్ధి, డిజిటల్ సార్వభౌమాధికారం వంటి జాతీయ ప్రాధాన్యతలను మరింత బలోపేతం చేస్తుంది.
స్థిరత్వం, ఆవిష్కరణ, సామర్థ్యం: స్వదేశీ ఏఐ ఆవిష్కరణలను బలోపేతం చేయడం |
భారతదేశం ఏఐ ని కేవలం ఒక సాంకేతికతగా మాత్రమే కాకుండా, పర్యావరణ బాధ్యతతో కూడిన మరియు వనరులను పొదుపుగా వాడే శక్తిగా చూస్తోంది. ఈ వర్కింగ్ గ్రూప్ (చక్రం) ప్రధానంగా వాతావరణ మార్పులను తట్టుకునేలా మరియు తక్కువ శక్తిని వినియోగించే ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెడుతుంది
ఏఐ పట్ల భారతదేశ విధానం సామర్థ్యం, స్థిరత్వంపై గట్టి ప్రాధాన్యతనిస్తుంది. సాంకేతిక పురోగతిని పర్యావరణ బాధ్యతతో, అందరికీ అందుబాటులో ఉండేలా సమన్వయం చేస్తుంది. ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సామర్థ్యం’ (Resilience, Innovation and Efficiency) అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్ భారతదేశ బలాన్ని పునాదిగా చేసుకుని, ‘సామర్థ్యాన్ని’ ఒక ప్రధాన సూత్రంగా ప్రోత్సహిస్తుంది. ఏఐ ని కేవలం ఒక సాంకేతికతగా మాత్రమే కాకుండా, పర్యావరణ బాధ్యతతో కూడిన, వనరులను పొదుపుగా వాడే శక్తిగా చూస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ అసమానతలను తగ్గిస్తూ, సమగ్రమైన, సుస్థిరమైన ఏఐ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది.
సమర్థవంతమైన ఏఐ అభివృద్ధిలో కొలవదగ్గ ఫలితాలు:
- పెరుగుతున్న డేటా మౌలిక సదుపాయాలు: ఏఐ వృద్ధితో పాటు భారతదేశంలో డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు పెరుగుతున్నాయి. దీని సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 960 మోగావాట్ నుంచి 2030 నాటికి 2 గిగా వాట్ కు చేరుకుంటుందని అంచనా.
- గిట్హబ్ భాగస్వామ్యం: 2024 గ్లోబల్ గిట్హబ్ ఏఐ ప్రాజెక్ట్ డేటా ప్రకారం, పబ్లిక్ జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులలో భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద సహకార దేశంగా అవతరించింది.
- గ్లోబల్ ఏఐ హబ్లు: గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత్ లో ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
- మైక్రోసాఫ్ట్: డేటా సెంటర్లు, ఏఐ శిక్షణ కోసం రూ.1.5 లక్షల కోట్లు.
- అమెజాన్: క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఆధారిత డిజిటలైజేషన్ కోసం 2030 నాటికి రూ.2.9 లక్షల కోట్లు.
- గూగుల్: విశాఖపట్నంలో 1 గిగా వాట్ సామర్థ్యం గల ఏఐ హబ్ కోసం రూ.1.25 లక్షల కోట్లు.
ఈ ప్రయత్నాలు అత్యాధునిక సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, పర్యావరణ స్పృహతో కూడిన ఆవిష్కరణలకు మద్దతునిస్తాయి, దేశ స్వయం సమృద్ధిని పెంపొందిస్తాయి.
శాస్త్రం: భారతదేశంలో ఏఐ ఆధారిత శాస్త్ర పరిశోధనలు |
పరిశోధనలు క్రమంగా డేటా-ఆధారితంగా, ఉమ్మడి భాగస్వామ్యంతో కూడినవిగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణం వంటి రంగాలలో శాస్త్ర పరిశోధనలను వాస్తవ ప్రపంచ పరిష్కారాలుగా మార్చడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న పరిశోధనా పునాది, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ‘ఓపెన్ సైన్స్’ పట్ల నిబద్ధతతో, భారతదేశం ప్రపంచ పరిశోధనా వ్యవస్థలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ‘సైన్స్’ (శాస్త్రం) అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్, పారదర్శకమైన ఏఐ ఆధారిత పరిశోధనలను, వివిధ ప్రాంతాలు, సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది.
భారతదేశ ఉమ్మడి ఏఐ శాస్త్ర పరిశోధనల్లో పురోగతి:
- ఆవిష్కరణల ముద్ర: పేటెంట్లను దాఖలు చేయడంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన దేశ ర్యాంకు 81 నుంచి 38వ స్థానానికి మెరుగుపడింది, ఇది శాస్త్ర పరిశోధనలు ఆచరణలోకి వస్తున్న తీరుకు నిదర్శనం.
- ఆర్&డీ పెట్టుబడుల పెరుగుదల: పరిశోధన, అభివృద్ధిపై జాతీయ వ్యయం 2010-11లో రూ.60,196 కోట్ల నుంచి 2020-21 నాటికి రూ.1.27 లక్షల కోట్లకు పెరిగింది. ఇది భారతదేశ శాస్త్ర పరిశోధనా వ్యవస్థ నిరంతర విస్తరణను సూచిస్తుంది.
- ఏఎన్ఆర్ఎఫ్ ఏఐ ఆధారిత పరిశోధన: జాతీయ పరిశోధనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ‘అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఏఎన్ఆర్ఎఫ్), 2023-2028 కాలానికి రూ.50,000 కోట్ల పరిశోధనా నిధిని లక్ష్యంగా పెట్టుకుంది.
- ఐఎండీ హైబ్రిడ్ ఏఐ అంచనాలు: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షపాతం, పిడుగులు, పొగమంచు, కార్చిచ్చులను అంచనా వేయడానికి హైబ్రిడ్ ఏఐ నమూనాలను ఉపయోగిస్తోంది. అలాగే, రైతులకు వాతావరణ సలహాలు అందించడానికి ‘మౌసమ్ జీపిటీ‘ (Mausam GPT) ను ప్రవేశపెట్టింది.
- స్టేలార్ సాధనం: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అభివృద్ధి చేసిన స్టేలార్ (STELLAR) అనే సాధనం, ఏప్రిల్ 2025లో ప్రారంభించిన ఒక స్వదేశీ మోడల్. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలకు (DISCOMs) ఉత్పత్తి-సరఫరా-నిల్వ ప్రణాళికలో సహాయపడుతూ, ఇంధన భద్రత కోసం ఏఐ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహిస్తోంది.
ఈ కార్యక్రమాలు ఉమ్మడి, పారదర్శకమైన ఏఐ సైన్స్లో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తూ, ప్రపంచవ్యాప్త సమాన అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ: ఉమ్మడి ఏఐ వనరుల అభివృద్ధి |
ఏఐ వ్యవస్థల అభివృద్ధి అనేది కంప్యూట్, డేటా, మౌలిక సదుపాయాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వనరులు ప్రస్తుతం వివిధ దేశాలు, సంస్థల మధ్య సమానంగా పంపిణీ కాలేదు. పరస్పర సహకారంతో కూడిన బహిరంగ మౌలిక సదుపాయాలు, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ అభివృద్ధికి తోడ్పడతాయి. ‘ ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ’ (Democratising AI Resources) అనే ఇతివృత్తంతో కూడిన వర్కింగ్ గ్రూప్, ఈ వనరులు అందరికీ సమానంగా అందేలా చూడటం, అంతర్జాతీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది.
ఉమ్మడి ఏఐ మౌలిక సదుపాయాలలో కీలక మైలురాళ్లు:
- సార్వభౌమ ఏఐ కంప్యూట్ : ఇండియా- ఏఐ మిషన్ కింద, వ్యూహాత్మక అవసరాల కోసం 3,000 అత్యాధునిక జీపీయూ లతో కూడిన సురక్షితమైన క్లస్టర్ను నిర్మిస్తున్నారు.
- ఇండియా– ఏఐ కోష్ (AIKosh): ఈ ప్లాట్ఫారమ్లో 20 రంగాలకు చెందిన 7,400 కంటే ఎక్కువ డేటాసెట్లు, 273 ఏఐ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది పరిశోధకులకు, స్టార్టప్లకు నాణ్యమైన, భారతీయ నేపథ్యంతో కూడిన డేటాను అందిస్తుంది.
- ఏఐ డేటా ల్యాబ్స్ నెట్వర్క్: టైర్-2, టైర్-3 నగరాల్లో డేటా అనోటేషన్, క్యూరేషన్లో శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఏఐ నైపుణ్యాలను పెంపొందించడానికి భారతదేశం 570 ల్యాబ్లతో కూడిన దేశవ్యాప్త నెట్వర్క్ను ప్రారంభిస్తోంది.
- నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్: ఈ ప్రతిష్టాత్మక మిషన్ ద్వారా ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్ లు, పరిశోధనా సంస్థలలో 40 పెటాఫ్లాప్స్ కంటే ఎక్కువ సామర్థ్యం గల యంత్రాలను ఏర్పాటు చేశారు.
- ఐరావత్ (AIRAWAT): ఇది భారతదేశపు అగ్రశ్రేణి ఏఐ సూపర్కంప్యూటర్. 2023లో ఐటీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది, పరమ్ సిద్ధి- ఏఐతో అనుసంధానించిన అత్యాధునిక పరిశోధనలకు కంప్యూట్ సేవలను అందిస్తోంది.
- కంప్యూట్ యాక్సెస్: ‘ఇండియా- ఏఐ కంప్యూట్ పోర్టల్’ ద్వారా 38,000 కంటే ఎక్కువ జీపియూలు, 1,050 టీపీయూలలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించే భారీ స్థాయి ఏఐ మోడల్స్ అభివృద్ధికి తోడ్పడుతుంది.
- తక్కువ ధరల ప్రయోజనం: అంతర్జాతీయంగా కంప్యూట్ వనరుల ధర గంటకు రూ.200 కంటే ఎక్కువగా ఉంటే, భారతదేశం దానిని సబ్సిడీపై గంటకు రూ.100 కంటే తక్కువ ధరకే అందిస్తోంది.
ఈ ప్రయత్నాలు బహిరంగమైన, అందరికీ అందుబాటులో ఉండే ఏఐ మౌలిక సదుపాయాల పట్ల భారతదేశ దార్శనికతను చాటుతున్నాయి.
ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ : ఏఐ ద్వారా ప్రభావాన్ని విస్తరించడం |
ఆర్థిక వృద్ధిని, సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి ఏఐ కి అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, దానిని భారీ స్థాయిలో అమలు చేయడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది. ‘ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ ‘ వర్కింగ్ గ్రూప్, స్పష్టమైన ఆర్థిక, సామాజిక ఫలితాలను ఇచ్చే ఏఐ పరిష్కారాలను విస్తరించడంపై దృష్టి పెడుతుంది.
ఏఐ ఆధారిత ఆర్థిక, సామాజిక ప్రభావం:
- వ్యవసాయం: ఏఐ ఆధారిత సలహా సాధనాలు విత్తనాలు వేయడం, దిగుబడి పెంచడం, వనరుల వినియోగంలో మెరుగుదల చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటిని అమలు చేయడం వల్ల ఉత్పాదకత 30-50% వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
- ఆరోగ్య సంరక్షణ: క్షయ (టీబి), క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఏఐ అప్లికేషన్లు కీలక పాత్ర పోషిస్తూ, నివారణ, రోగనిర్ధారణ చికిత్సను బలోపేతం చేస్తున్నాయి.
- విద్య: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020లో భాగంగా.. సీబిఎస్సీ పాఠ్యాంశాలు, ‘దీక్ష’ (DIKSHA) ప్లాట్ఫారమ్లు, ‘యువాయి’ (YUVAi) వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక ఏఐ నైపుణ్యాలను అందిస్తున్నారు.
- న్యాయ వ్యవస్థ: ‘ఈ-కోర్ట్స్ ఫేజ్ III’ (E-Courts Phase III) లో భాగంగా అనువాదాలు, కేసుల నిర్వహణ, పౌర సేవల కోసం ఏఐ, ఎంఎల్ లను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రాంతీయ భాషల్లో సేవలను అందిస్తూ పారదర్శకతను పెంచుతోంది.
- ఆర్థిక వృద్ధి: పెరుగుతున్న డిజిటల్ డిమాండ్ కారణంగా, భారతదేశపు ఏఐ ఆధారిత సాంకేతిక రంగం 2025లో సుమారు 280 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా.
- స్టార్టప్ వ్యవస్థ: భారతదేశంలో సుమారు8 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. 2024లో ప్రారంభమైన కొత్త స్టార్టప్లలో దాదాపు 89% తమ ఉత్పత్తులు లేదా సేవల్లో ఏఐ ని ఉపయోగించాయి. ఇది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సామాజిక వృద్ధికి తోడ్పడుతోంది.
ముగింపు |
ఇండియా– ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026, అంతర్జాతీయ ఏఐ ఎజెండాను రూపొందించడంలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. ‘ఏడు చక్రాలు‘ (Seven Chakras), ‘మూడు సూత్రాలు‘ (ప్రజలు, గ్రహం, పురోగతి – People, Planet, and Progress) ప్రాతిపదికన, ఈ సమ్మిట్ కృత్రిమ మేధ (ఏఐ) కోసం అభివృద్ధి-ఆధారిత చట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
విధాన నిర్ణయాలను అమలుతోనూ, ఆవిష్కరణలను ప్రజా ప్రయోజనాలతోనూ అనుసంధానించడం ద్వారా, బాధ్యతాయుతమైన ఏఐ విస్తరణకు ఈ సమ్మిట్ ఒక వ్యవస్థీకృత విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది సాంకేతిక పురోగతిని సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధితో సమన్వయం చేస్తుంది.
ప్రపంచ ఏఐ సహకారంలో భారతదేశాన్ని ఒక సమన్వయకర్తగా, భాగస్వామిగా ఈ సమ్మిట్ నిలుపుతుంది. ఉమ్మడి ప్రమాణాలు, సహకార చట్రాలు, ప్రజా ప్రయోజనాల కోసం భారీ స్థాయి పరిష్కారాలకు ఇది మద్దతు ఇస్తుంది. ఇది కేవలం చర్చల స్థాయి నుంచి ఫలితాల స్థాయికి చేరిన పరిణామ క్రమాన్ని సూచిస్తుంది; తద్వారా బాధ్యతాయుతమైన, సమ్మిళిత, అభివృద్ధి-కేంద్రీకృత ఏఐ మార్గాల పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
References
Ministry of Electronics & IT
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206767®=3&lang=1
- https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2216760®=3&lang=2
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2097709®=3&lang=2
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200799&lang=1®=3
- https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/nov/doc2025115685601.pdf
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2179035®=3&lang=2
Ministry of Earth Sciences
Ministry of Agriculture & Farmers Welfare
NITI Aayog
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177440®=3&lang=2
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2176362®=3&lang=2
PIB Backgrounders
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2186327®=3&lang=2
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178092®=3&lang=2
- https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209737®=3&lang=2
India–AI Impact Summit 2026
Principal Scientific Adviser (PSA)
PIB Research


















































