అమరావతి, డిసెంబర్ 22 :
Allocation of funds for construction of buildings in Amaravati Quantum Valley
-
క్వాంటం వ్యాలీలో భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు
• క్వాంటం వ్యాలీ లో 2 భవనాల నిర్మాణానికి రూ. 103.96 కోట్లు
• ఐఏఎస్ ల భవనాల ఇంటీరియర్ పనులకు రూ. రూ. 109కోట్లు
• సీఆర్డీఏ పాలనా వ్యయానికి రూ. 100 కోట్లు
• రాజధానిని వరద ముంపు తప్పించడానికి చర్యలు
• జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు రూ. 1,358 కోట్లు
అమరావతి :
రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ క్వాంటం కంప్యూటింగ్ ఎక్విప్ మెంట్ అమరావతికి చేరుకోనున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన రెండు భవనాలను 43వేల చదరపు అడుగుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. భవనాల నిర్మాణానికి టెండర్ పిలిచి ఎల్1 కూడా చేయడం జరిగిందన్నారు. సీఆర్డీఏ అథారిటీ భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. అలాగే అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం రూ. 109 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.
నాబార్డ్ మంజూరు చేసిన రూ. 7500 కోట్లలో రూ. 1502 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందన్నారు. వాటిలో రూ.100 కోట్లు ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇందు నిమిత్తం 23.127 ఎకరాలు శాఖమూరు గ్రామ పరిధిలో కేటాయించడం జరిగిందన్నారు. యూనివర్సిటీకి 60 సంవత్సరాలు ఒక రూపాయి లీజు తో ఇవ్వడం జరిగిందన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి ఆయుష్ సంస్థ రూ. 750 కోట్లకు పైగా వ్యయం చేయనుందన్నారు.
సదరన్ గ్లోబల్ హోటళ్ల వారికి గతంలో కేటాయించిన 2 ఎకరాలు, ఓం సాయి అసోసియేషన్ కు కూడా 4 ఎకరాలు కేటాయింపులు జరిగినా అక్కడ భూ సమస్యలు తలెత్తడంతో వారికి ఇతర ప్రాంతంలో భూమి కేటాయింపులు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. అమరావతిని వరద ముంపు నుండి కాపాడటానికి నెదర్లాండ్స్ తో డిజైన్స్ రూపొందించడం జరిగిందని, కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ లతో పాటు 6 రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందన్నారు. ఇవి కాకుండా అధికంగా వచ్చే వరద ముప్పు నుండి రక్షణగా మరో 22,500 క్యూసెక్క్ ల నీటిని బటయకు తరలించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
గుంటూరు ఛానల్ ద్వారా 4వేల క్యూసెక్కులు, ఉండవల్లిలో మరో 8,400 క్యూసెక్కులు పంపింగ్ చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. అదనపు వరద నీరు తరలించడానికి రూ. 443.76 కోట్లు అవుతుందని తెలిపారు. దీంతో క్లౌడ్ బరస్ట్ లాంటివి వచ్చినా నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు రూ. 1,358 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక జరీబు, నాన్ జరీబు భూముల పై రైతుల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జరీబు భూముల భూములపై గతంలో మండలం, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు 18 ఎకరాలు తప్ప మిగిలిన భూములు నాన్ జరీబు అని తేల్చారని వివరించారు.
అయితే రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు వివిధ డిపార్ట్ మెంట్ ల అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని వేయడం జరుగుతుందన్నారు. 2014 డిసెంబర్8న తీసిన శాటిలైట్ చిత్రాలను ఆధారంగా జరీబు భూములను నిర్ణయం ఉంటందని మంత్రి నారాయణ తెలిపారు.


















































