రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల ద్వారా 78వేలమందికి ఉద్యోగాలు
ఇండస్ట్రీ కనెక్ట్ తో ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు
స్కిల్ డెవలప్ మెంట్ పై మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 406 జాబ్ మేళాల ద్వారా 78వేలమంది యువతకు ఉద్యోగాలు లభించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై మంత్రి నారా లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
జాబ్ మేళాల్లో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలని అన్నారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా డిజిటల్, ఎఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అధునాతన సాంకేతికతలపై ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఐటిఐ, పాలిటెక్నిక్ ల కరిక్యులమ్ లో మార్పులపై దృష్టిసారించాలన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ అధికారులు మాట్లాడుతూ… రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివిన వారిలో 94.6, ఐటిఐలలో 98శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు.
యువతకు బ్లూకాలర్ ఉద్యోగావకాశాల కోసం 30 ఇండస్ట్రీ ఎలైడ్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 12 మోడల్ కెరీర్ సెంటర్ల ద్వారా 1,22,575 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. విదేశీ ఉద్యోగావకాశాలను పెంచేందుకు రాష్ట్రంలో జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్ భాషల్లో శిక్షణ కోసం ఇఫ్లూతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఓంక్యాప్ ద్వారా 1300మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 5 క్లస్టర్ల పరిధిలోని 16 సెక్టార్లలో 273 పారిశ్రామిక సంస్థలతో ఐటిఐ, పాలిటెక్నిక్ లను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ల్యాబ్ స్పాన్సర్ షిప్ కోసం 17పరిశ్రమలు ముందుకు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 ఇండస్ట్రియల్ క్లస్టర్ల పరిధిలో 16 పెద్ద సంస్థలను గుర్తించి పాలిటెక్నిక్, ఐటిఐలతో అనుసంధానించాలని అన్నారు.
రాష్ట్రస్థాయి న్యాక్ సెంటర్ ను మంగళగిరిలో ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై ఐటిఐలలో 30, పాలిటెక్నిక్ కళాశాలలో 23 యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్ లకు విద్యార్థులకు సంబంధించి 95శాతం అపార్ ఐడి అథెంటికేషన్ పూర్తయినట్లు చెప్పారు. యువతకు అత్యంత ఉపయుక్తంగా తీర్చిదిద్దిన నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, ఓంక్యాప్ అడ్వైజర్ సీతా శర్మ, సీడ్యాప్ సిఈఓ నారాయణ స్వామి పాల్గొన్నారు.


















































